పారిస్: ఫ్రాన్స్ బిలియనీర్ ఒలివర్ డసాల్ట్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. డసాల్ట్ విమాన సంస్థ కుటుంబీకుల్లో ఆయన ఒకరు. రాజకీయవేత్త కూడా. ఆదివారం జరిగిన విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అధ్యక్షుడు ఎమ్మాన్యువల్ మాక్రన్.. ఒలివర్ మృతి పట్ల నివాళి అర్పించారు. నిరంతరం దేశ సేవలో నిమగ్నమైన కెప్టెన్ ఇక లేరని తన ట్విట్టర్లో మాక్రన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నార్తర్న్ ఫ్రాన్స్లోని డ్యూవిల్లీలో ఒలివర్ డసాల్ట్ విమానం కూలినట్లు అధికారులు తెలిపారు. వైమానిక పరిశ్రమలో ఒలివర్ డసాల్డ్ ఓ కెప్టెన్ లాంటి వారని మాక్రన్ అన్నారు. స్థానిక ఎంపీ అని, ఎయిర్ఫోర్స్లో రిజర్వ్ కమాండర్గా చేశారన్నారు. జీవితాంతం ఆయన దేశ సేవకే అంకితమయ్యారన్నారు. ఒలివర్ మృతి దేశానికి తీరని లోటు అని పేర్కొన్నారు. డసాల్ట్ కుటుంబీకులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఒలివర్తో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. డసాల్ట్ విమాన సంస్థను ఏర్పాటు చేసిన మార్సెల్ డసాల్ట్ మనవడే ఒలివర్ డసాల్ట్. ఫ్రాన్స్లో వీరిది అత్యంత సంపన్న కుటుంబం.