న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ రాజ్యసభలో పలువురు మహిళా ఎంపీలు మాట్లాడారు. అంతర్జాతీయ మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేయాలని బీజేపీ ఎంపీ సోనాల్ మాన్సింగ్ డిమాండ్ చేశారు. మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటే.. అప్పుడు మనం మెన్స్ డేను కూడా సెలబ్రేట్ చేసుకోవాలని ఆమె అన్నారు. నాయకత్వ పాత్రల్లో కనీసం ఆరు శాతం మందికి కూడా అవకాశం దక్కలేదని అనేక సర్వేలు చెబుతున్నాయని ఎన్సీపీ ఎంపీ డాక్టర్ ఫౌజియా ఖాన్ తెలిపారు. రాజ్యసభ, లోక్సభలోనూ 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని ఆమె కోరారు. పార్లమెంట్లో 33 శాతం రిజర్వేషన్ మహిళలకు కల్పించాలని 24 ఏళ్ల క్రితం ప్రతిపాదన చేశామని, ఇప్పుడు ఆ రిజర్వేషన్ శాతాన్ని 50కి పెంచాలని, పార్లమెంట్-అసెంబ్లీ స్థానాల్లో అమలు చేయాలని శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది అన్నారు.
రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కూడా మహిళా దినోత్సవం సందర్భంగా సభలో మాట్లాడారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయంగా మహిళలు సాధించిన ఘనతలను ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని, మహిళల స్పూర్తిని, దీక్షను, ప్రయత్నాలను గుర్తించాలన్నారు.