కొత్తూరు రూరల్ : పంటపొలాల్లో కలుపు నివారణలో రైతులు మెలకువలను పాటించాలని ప్రొపెసర్ జయశంకర్ వ్యసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పద్మజ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని శేరిగూడబద్రాయపల్లి గ్రామంలో సర్పంచ్ అంబటి ప్రభాకర్ ఆధ్వర్యంలో శనివారం రైతులకు వయ్యారిభామ కలుపు నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయ్యారిభామ చాలా ప్రమాదకరమైన కలుపుమొక్క అని, దీని ముక్కుపుల్ల అలం, కారెట్ గడ్డి, నక్షత్రగడ్డి అని పిలుస్తారని తెలిపారు.
ఈ అలం అమెరికా నుంచి మన దేశానికి గోధుమల ద్వార దిగుమతి అయ్యిందన్నారు. ఒక్కొక్క మొక్క దాదాపు 25000 వరకు విత్తనాన్ని తయారు చేస్తుందన్నారు. మొక్క మొలచిన 4వారాల్లోనే పుష్పిస్తుందన్నారు. ఈ మొక్క ఖాళీ ప్రదేశాల్లోనే కాకుండా పంట పొలాలను ఆశించి 40నుంచి 70శాతం దిగుబడి నష్టాన్ని కల్గిస్తుందన్నారు. మనుషులలో ఎలర్జీ, దురద, ఉబ్బసం, తామర వంటి వ్యాధులను కల్గిస్తుందన్నారు. పశువులలో పాల దిగుబడిని తగ్గిస్తుందన్నారు. వివిధ పద్దతులను ఉపయోగించి పుష్పించకముందే నిర్మూలించాలని ఆమె రైతులకు తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గోపాల్, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు.