తిరుపతి,మే1: చిత్తూరు జిల్లాలోని కరకంబాడి,నూనెగుండ్లపల్లి లో స్థాపించిన అమర రాజ బ్యాటరీస్ లిమిటెడ్(ఏఆర్బిఎల్) ను మూసి వేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణా మండలి నుంచి ఏప్రిల్ 30 వ తేదీన ఆదేశాలు అందాయి. అయితే మండలి ఆదేశాల మేరకు యాజమాన్యం పూర్తి స్థాయిలో పర్యావరణపరిరక్షణ చర్యలపై సమీక్షించింది. వాటాదారుల ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యంగా అమరాజ గత 35 ఏండ్లుగా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది. దేశ విదేశాలలో అతి కీలక మైన రంగాలైన రక్షణ, వైద్య, టెలికాం విభాగాలలో కంపెనీ ఉత్పత్తులను అందజేస్తూ, వాణిజ్య, సామాజిక, పర్యావరణ సంరక్షణలో ఖచ్చితమైన నియమ, నిబంధనలను పాటిస్తూ సమాజ స్ఫూర్తి దాయక విలువలను సంస్థ ఎల్లప్పుడూ పాటిస్తూ ఉద్యోగులతోపాటుసమాజం, వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే ఉంటామని పేర్కొంది.
కాలుష్య నియంత్రణా మండలి ఆదేశాల ప్రకారం వినియోగదారులు, సరఫరాదారులు, భాగస్వాముల ప్రయోజనాలకు ఆటంకాలు కలగకుండా అమర రాజ బ్యాటరీస్ అన్ని చర్యలు చేపట్టింది. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి విజ్రింబిస్తున్న సమయంలో సరఫరాలకు ఎటువంటి అంతరాయం కలిగిన అది తీవ్ర నష్టాన్ని కలగ చేస్తుంది. మండలి ఆదేశాలమేరకు వెంటనే చర్యలు ప్రారంభించింది. కంపెనీ ఆధారిత రంగాలు బ్యాటరీల సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, అన్ని మార్గాలను పరిశీలిస్తోంది. కంపెనీ సరఫరా చేస్తున్న ప్రధాన వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చేయటానికి నియంత్రణా మండలి అధికారులతో చర్చలు సాగిస్తున్నట్లు అమరారాజ సంస్థ తెలిపింది. అనేక సంవత్సరాలుగా సంస్థ వివిధ వార్షిక ,ద్వైవార్షిక పర్యావరణ ఆడిట్లు, ధ్రువపత్రాలు పొందడమే కాకుండా. భద్రత , పర్యావరణ రక్షణ లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులను అందుకున్నట్లు సంస్థ వివరించింది.