వికారాబాద్ : ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ క్రీడా ప్రాంగణానికి త్వరితగతిన భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్ నిఖిల తహసీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేటులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ 174 విజ్ఞప్తులను స్వీకరించారు. అనంతరంమండల తహసీల్దార్లతో గ్రామాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణానికి సేకరించాల్సిన భూముల వివరాలు, ప్రభుత్వ జి.ఒ. 58, 59 లో వచ్చిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సంర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ క్రీడా ప్రాంగణానికి కావాల్సిన భూములను సేకరించేందుకు తహసీల్దారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రెండు రోజుల్లో నివేదికలు ఆందజేయాలన్నారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఆవశ్యకత ఎంతో అవసరమని, దీనికి అనుగుణంగా గ్రామాల్లో సుమారు 20 గుంటల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు స్థలాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలు లేని పక్షంలో నీరు చేరే అవకాశం లేని శిఖం భూములల్లో క్రీడా ప్రాంగణానికి స్థల నిర్ధారణ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.