పెద్దేముల్ : వైద్య సిబ్బంది అందరి సమన్వయంతో మండలంలో రానున్న రెండు రోజుల్లో 100% కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్, కరోనా వ్యాక్సినేషన్ జిల్లా నోడల్ అధికారి డా.రజినిరెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లాలో తక్కువ శాతం వ్యాక్సినేషన్ అయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆకస్మిక తనిఖీలో భాగంగా పెద్దేముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, సిబ్బందితో మాట్లాడి, పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 16న ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండు మూడు రోజుల్లో 100% వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలన్నారు.
మండలంలో మొత్తం 29,890 మందికిగాను 23,083 మందికి వ్యాక్సినేషన్ పూర్తి కాగా, మిగతా 6,807 మంది ఇంకా వ్యాక్సినేషన్ ఎందుకు తీసుకోలేదని? వ్యాక్సిన్ తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి? వారికి అవగాహన కల్పించారా? మిగతావారికి ఎన్ని రోజుల్లో వ్యాక్సిన్ వేస్తారు? వైద్య సిబ్బంది ఏమన్నా అవసరమా? అని అడిగి రెండు రోజుల్లో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు ఆస్పత్రి శుభ్రత, నిర్వహణపై మెడికల్ ఆఫీసర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో మిగిలిన 6,807 మందికి త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లేకపోతే మెమోలు జారీ చేస్తానని రజినిరెడ్డి హెచ్చరించారు.
జిల్లా వైద్యాధికారి డా.తుకారాంభట్ మాట్లాడుతూ.. జిల్లాలో 78 వేల కరోనా డోసులు అందుబాటులో ఉన్నాయని, మొదటిసారిగా ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్లో 24 రోజుల వ్యవధిలో 42% వ్యాక్సినేషన్ పూర్తికాగా, ప్రారంభించిన మూడు రోజుల్లో రాష్ట్రంలో జిల్లా టాప్లో నిలిచిందన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 7,09,526 మందికిగాను ఇప్పటివరకు 2,95,035 మందికి ఫస్ట్ డోసు వ్యాక్సిన్ పూర్తి చేయగా.. 78,368 మందికి సెకండ్ డోసు పూర్తి చేశామని, నేటి సాయంత్రం వరకు జిల్లావ్యాప్తంగా 80% వరకు చేరుకునే అవకాశం ఉందని అన్నారు. మండల కేంద్రంతో పాటు అన్ని సబ్ సెంటర్లలో వైద్య సిబ్బంది అందరి సమన్వయంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, మండలంలో ఇప్పటివరకు 77% పూర్తికాగా, మిగతా 23 శాతాన్ని రెండు రోజుల్లో వైద్య సిబ్బంది పూర్తి చేయాలని.. ఆ దిశగా మెడికల్ ఆఫీసర్లు చర్యలు చేపట్టాలని రజినిరెడ్డి ఆదేశించారు. అనంతరం ఆస్పత్రిలో పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఉప వైద్యాధికారి డా.ధరణి కుమార్, జిల్లా ఎంసీహెచ్ వైద్యురాలు డా.లలిత, జిల్లా డీఐవో డా.జీవరాజ్, మెడికల్ ఆఫీసర్ డా.శ్రావణ్ కుమార్రెడ్డి, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.