పరిగి : పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 2వేల కోట్లు బడ్జెట్లో కేటాయించిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శనివారం మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయు లుగా ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించడానికి సర్కారు కృషి చేస్తుందన్నారు. గురువులే ప్రత్యక్ష దైవాలని, సమాజానికి ఉత్తమ పౌరులను అందించే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. డీఎంఎఫ్టీ నిధులలో ఈసారి అత్యధిక శాతం పాఠశాలలకే కేటాయించడం జరుగుతుందన్నారు. 100శాతం అక్షరాస్యత సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
పాఠశాలల్లో స్కావెంజర్ల సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడంతో పాటు పదవీ విరమణ వయస్సు పెంచడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, జెడ్పీటీసీ హరిప్రియ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, ఎంఈవో హరిశ్చందర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.