ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ నిఖిల
పరిగి : దేశంలోనే మొదటిసారిగా వికారాబాద్ జిల్లాలో మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కార్యక్రమం జరగనుందని ఈ కార్యక్రమం ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. ఈ నెల 11న ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ ప్రారంభోత్సవానికి సంబంధించి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నిఖిల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు సదుపాయాలు లేని, దూర ప్రాంతాలకు అత్యవసర సమ యంలో రోగులకు అవసరమైన మందులు, వ్యాక్సిన్లు అందించేందుకు ఈ కార్యక్రమం ద్వారా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఇందుకు సంబంధించి 11న నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేసి ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కొత్త కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలోని హెలిప్యాడ్, పోలీస్ పరేడ్గ్రౌండ్స్లో సభాస్థలి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ రెండుచోట్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్అండ్బీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద డాక్టర్లను సిద్ధంగా ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. సభాస్థలి వద్ద మాస్కులు లేని వారికి మాస్కులు అందించాలని, శానిటైజర్ అందుబాటులో ఉంచాలన్నారు. సభా ప్రాంగణంలో ఒక అంబులెన్స్తో పాటు ఫైర్ ఇంజన్ ఉంచాలన్నారు. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరిగేలా చూడాలని ఆమె సూచించారు.
డ్రోన్ ట్రయల్ పరిశీలన..
అత్యవసర సమయాల్లో డ్రోన్ ద్వారా మందుల తరలింపునకు సంబంధించిన డ్రోన్ ట్రయల్ను కలెక్టర్ నిఖిల గురువారం పరిశీలించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ కార్యక్రమం ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ, జిల్లా అదనపు కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య, జిల్లా అదనపు ఎస్పీ రషీద్, జిల్లా వైద్యాధికారి తుకారామ్, ఆర్అండ్బీ ఈఈ లాల్సింగ్, ఆర్టీవో భద్రునాయక్, వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు ఉపేందర్రెడ్డి, అశోక్కుమార్, అధికారులు పాల్గొన్నారు.
దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా మందుల తరలింపునకు సంబంధించి ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ కార్యక్రమాన్ని ఈ నెల 11న వికారాబాద్లో ప్రారంభం కానుంది. వికారాబాద్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం ఉదయం 11. 25 గంటలకు ఈ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్లు ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో కలిసి హెలికాప్టర్లో బయలుదేరి 11:20 గంటలకు వికారాబాద్కు చేరుకుంటారు. ఈ మేరకు కొత్త కలెక్టరేట్ ఆవరణలో హెలిపాడ్ ఏర్పాటు చేయడం జరిగింది.