బొంరాస్పేట : మండలంలో సోమవారం రాత్రి కురిసిన వర్షం 53.04 మిల్లీ మీటర్ల వర్షపాతంగా నమోదైంది. భారీ వర్షానికి మండలంలోని మెట్లకుంట ఎల్లమ్మ చెరువు, బురాన్పూర్ పెద్ద చెరువు, తుంకిమెట్ల పెద్ద చెరువు, వడిచెర్ల, కొత్తూరు, నాందార్పూర్ చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. మెట్లకుంట ఎల్లమ్మ చెరువు, ఏర్పుమళ్ల కాకరవాణి ప్రాజెక్టుల నుంచి వరద నీరు భారీగా బొంరాస్పేట పెద్ద చెరువులోకి వస్తుండటంతో చెరువు అలుగు పారుతుంది. అలుగు నుంచి వచ్చే వరద నీరు తుంకిమెట్ల-బొంరాస్పేట మధ్యన ఉన్న రోడ్డుపై నుంచి పారుతున్నాయి. బొంరాస్పేట చెరువు అలుగును చూడటానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వరుసగా రెండో ఏడాది కూడా చెరువులు నిండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంటలకు ఢోకా ఉండదని రైతులు ఆనందంలో ఉన్నారు.
రోడ్డుపై గొయ్యి
భారీ వర్షానికి మెట్లకుంట గ్రామ రోడ్డుపై మధ్యలో పెద్దగా గుంత ఏర్పడింది. వరద నీరు రోడ్డుపై నుంచి పారడంతో రోడ్డు దెబ్బతిని గొయ్యి ఏర్పడింది. ద్విచక్ర వాహనాలు తప్ప పెద్ద వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఎలాంటి ప్రమాదం జరుగకుండా గుంతలో చెట్టు కొమ్మలను అడ్డంగా వేశారు. అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.