శంకర్పల్లి, ఆగస్టు 3 : సర్పంచులు అంతర్గత రోడ్ల వెంబడి నాటిన మొక్కలను సంరక్షించాలని ఎంపీడీవో సత్తయ్య సూచించారు. మంగళవారం మండలంలోని జనవాడ, పర్వేద గ్రామాల్లో అంతర్గత రోడ్ల వెంబడి నాటిన మొక్కలను పరిశీలించారు. జనవాడలో సర్పంచ్ లలిత నాటిన మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయించారు.
నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఇందులో భాగంగా మున్సిపాలిటీలోని 28వ వార్డు గాంధీనగర్ కాలనీలో మంగళవారం నాటిన మొక్కలను పరిశీలించి నీళ్లు పోశారు. వార్డుల్లో నాటిన మొక్కలను కాపాడాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలన్నారు.
భావితరాలకు వనసంపద అందించాలి
పర్యావరణ రక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని కనకమామిడి సర్పంచ్ జనార్దన్రెడ్డి అన్నారు. చిలుకూరు గ్రామ రెవెన్యూలో ఉన్న కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో విద్యార్థులు కనకమామిడిలో హరితహారాన్ని నిర్వహించారు. గ్రామంలో 1500 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా మంగళవారం 300 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మొక్కలు పెంచి భావితరాలకు వనసంపదను అందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
మొక్కలకు ట్రీ గార్టుల ఏర్పాటు
పర్వేద, జనవాడ గ్రామాల్లో మండలాధికారులు సీసీ రోడ్లకిరువైపులా మొక్కలు నాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేయించారు. మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు కూడా తీసుకోవాలన్నారు. మొక్కలను మేకలు, పశువులు నాశనం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో సత్తయ్య, పర్వేద, జనవాడ సర్పంచులు, సెక్రటరీలు గ్రామస్తులకు సూచించారు.