వికారాబాద్ : జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ 12వ అదనపు న్యాయమూర్తి పద్మ తెలిపారు. శనివారం వికారాబాద్ కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ నిర్వహించగా పలు రకాల కేసులను అక్కడిక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా వికారాబాద్ 12వ అదనపు న్యాయమూర్తి పద్మ మాట్లాడుతూ రాజీ పడడంతో ఇరువురు గెలిచినట్లేనన్నారు. లోక్ అదాలత్ ద్వారా ఇరువురికి సమాన న్యాయం జరుగుతుందన్నారు. ఇందులో చిన్న చిన్న తగాదాలతో కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు సమయాన్ని వృథా చేసుకోకుండా లోక్అదాలత్ ద్వారా రాజీపడే అవకాశం ఉందన్నారు.
ఇందులో కోర్టు కేసులు, భూములకు సంబంధించి, క్రిమినల్ కేసులు, కుటుంభానికి సంబంధించిన కేసులు లాంటి పలు రకాల కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 90కేసులు రాజీపడినట్లు 12వ అదనపు న్యాయమూర్తి తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, జనరల్ సెక్రటరీ రమేశ్ ముదిరాజ్, వైస్ ప్రెసిడెంట్ రమేశ్గౌడ్, నాయ్యవాదులు, పోలీసులు పాల్గొన్నారు.