వికారాబాద్ : జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోగ నిర్ధారణ రక్త నమూనాల సేకరణను సకాలంలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల వైద్యాధికారులకు సూచించారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వద్ద వైద్య శాఖ ఆధ్వర్యంలో రక్త నమూనాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన రెండు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రోజు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రక్త నమూనాలను సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్కు వాహనాల ద్వారా తరలిస్తే, సేకరించిన నమూనాల పరీక్షలు నిర్వహించి అట్టి రిపోర్టులను పీహెచ్సీకి, రోగి ఫోన్కు పంపడం జరుగుతుందని తెలిపారు. దీని వల్ల రోగ నిర్ధారణ జరిగిన రోగికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుపడుతుందన్నారు.
రక్త నమూనాల సేకరణ ప్రతి రోజు వాహనముల ద్వారా జరుగాలని ఆదేశించారు. అనంతరం డీ-హబ్లో నిర్వహిస్తున్న పరీక్షలను, పని తీరును సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం, డిప్యూటీ డీఎంహెచ్వో జీవరాజ్, డాక్టర్ బిజిలిన్, డాక్టర్లు అరవింద్, పవిత్ర, వైద్య సిబ్బంది ఉన్నారు.