మొయినాబాద్, సెప్టెంబర్ 25 : మహిళలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించినప్పుడే ఆర్థికంగా ఎదుగడానికి అవకాశముంటుందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్కుమార్ అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు గ్రామ రెవెన్యూలోని మహిళా ప్రాంగణం ఆవరణలో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం(ఎస్బీఐ)వారి సౌజన్యంతో 27 రోజులపాటు క్యాబ్ డ్రైవర్లుగా శిక్షణ పొందిన అభ్యర్థులకు శనివారం సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కూడా క్యాబ్ డ్రైవర్లుగా ఎదుగడానికి పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాను ఎంపిక చేశారని పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్తోపాటు కార్లను కూడా ఇస్తారని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలు అభివృద్ధి చెందడానికి అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. చదువుకున్నవారికి పలు శిక్షణలు ఇచ్చి.. వారిలో నైపుణ్యాన్ని పెంపొందించి ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రవీణ్, ఆర్సెటి డైరెక్టర్ శ్రీధర్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బంది గణపతి, లక్ష్మయ్య, శ్రీనివాస్రెడ్డి, ఆర్సెటి సిబ్బంది పాల్గొన్నారు.