అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాల్లో వెనుకబడిన వర్గాలను ప్రోత్సహిస్తున్నది. తాజాగా మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. మొత్తం 30శాతం దుకాణాలకు రిజర్వేషన్ల అమలుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇందులో దళితులకు 10శాతం, గౌడ్లకు 15శాతం, గిరిజనులకు 5 శాతం కేటాయించింది. వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 46 మద్యం దుకాణాలు ఉండగా.. రిజర్వేషన్లకు సంబంధించిన కసరత్తు జరుగుతున్నది.
పరిగి, సెప్టెంబర్ 18 : రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ పద్ధతిని ప్రకటించింది. మద్యం దుకాణాలంటేనే డబ్బులున్నవారు చేసే వ్యాపారంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. మద్యం దుకాణాల్లో 30 శాతం రిజర్వేషన్లకు మంత్రివర్గం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
30శాతం రిజర్వేషన్లు
ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఈ సంవత్సరం నుంచి 30 శాతం దుకాణాలకు రిజర్వేషన్లు అమలు చేస్తారు. ఇందులో దళితులకు 10 శాతం, గౌడ్లకు 15 శాతం, గిరిజనులకు 5 శాతం దుకాణాల కేటాయింపు ఉంటుంది. వికారాబాద్ జిల్లా పరిధిలో 46 మద్యం దుకాణాలున్నాయి. వాటితోపాటు 6 బార్లు కొనసాగుతుండగా ప్రతిరోజు సుమారు రూ.కోటి40లక్షల మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు 46 దుకాణాల్లో ప్రకటించిన మేరకు 30 శాతం దుకాణాలు ఆయా సామాజిక వర్గాలకు కేటాయిస్తారు. ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతున్నది. కొత్త మద్యం దుకాణాల పాలసీ ప్రారంభం నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. మరోవైపు ఈసారి మద్యం దుకాణాల గడువు నవంబర్ నెలాఖరు వరకు పొడిగించారు. అప్పటిలోపు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ కేటాయింపులు జరిపి లక్కీడిప్ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. 18 సంవత్సరాలు పైబడినవారు నిర్ణీత ఫీజు చెల్లించి మద్యం దుకాణాల టెండర్లలో పాల్గొనవచ్చు. మద్యం దుకాణాలకు సంబంధించి విపరీతమైన పోటీ ఉండనుంది. గతంలో ఒక్కో దుకాణానికి సుమారు 20పైగా దరఖాస్తులు వచ్చిన సంఘటనలున్నాయి. ఈసారి అలాంటి పోటీ తీవ్రంగా ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది.
వ్యాపారపరంగా ఎదిగేందుకు దోహదం..
మద్యం దుకాణాల్లో 30శాతం కోటాను వివిధ సామాజిక వర్గాలకు కేటాయించడంతో వారు ఆర్థికంగా ఎదిగేందుకు దోహదం చేస్తుంది. ఇప్పటివరకు మద్యం దుకాణాలంటే కోటీశ్వరులు, ఆర్థికంగా బాగా ఉన్న వారే టెండర్లలో పాలుపంచుకునేవారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి మద్యం దుకాణాలు కేటాయించడంతో మరింత అభివృద్ధి సాధించనున్నారు. ఇప్పటికే దళితుల ఆర్థికాభివృద్దికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి మీకు నచ్చిన వ్యాపారం చేయాలని, నచ్చిన యూనిట్ను నెలకొల్పుకోవచ్చని చెప్పారు. దీంతో వారు ఆర్థికంగా ఎదుగడానికి దళిత బంధు తోడ్పడుతుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలోని ఏ ప్రాంతంలోని దుకాణం ఎవరికి రిజర్వు కాబడుతుందోనని అప్పుడే చర్చ మొదలైంది. రిజర్వేషన్లు కేటాయించబడిన సామాజిక వర్గాలవారు మద్యం వ్యాపార రంగంలోకి అడుగిడేందుకు అవసరమైన మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్నేహితులు, బంధువులు, ఇతరులతో కలిసి ఈ మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.
ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం కోటా హర్షణీయం
ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వైన్స్ టెండర్లలో 15 శాతం కోటాను కేటాయించడం హర్షణీయం. ఎస్సీ, ఎస్టీలు కూడా వ్యాపారంలో రాణించేందుకు ఇది మంచి అవకాశం.
ఎస్సీలు అభివృద్ధి సాధించేందుకు మంచి అవకాశం
ప్రభుత్వం మద్యం టెండర్లలో 15 శాతం ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడంతో వ్యాపార రంగంలో కొద్దిమేర న్యాయం జరుగుతుంది. గతంలో అగ్రకులాల నాయకులే ఎక్కువగా వైన్స్లను వేలం పాటలో దక్కించుకునేవారు. కాని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గౌడ కులవృత్తులతోపాటు ఎస్సీలు, ఎస్టీలకు ఉపయోగకరంగా ఉంటుంది.