పరిగి, జూలై 12 : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా ఆదివారం రాత్రి, సోమవారం భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వానకాలం పంటలకు ఈ వర్షాలు ఎంతో మేలు కలిగిస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమాదిరిగా వర్షాలు కురిస్తే చెరువులు, కుంటల్లోకి నీరు చేరే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. తద్వారా ఆయా ప్రాంతాల్లో వాగుల్లో వరద నీరు పారింది. మర్పల్లిలో 1.4 మి.మీ, వికారాబాద్ 5.8, పూడూరు 3.2, పరిగి 18.2, కులకచర్ల 18.4, దోమ 26, బొంరాస్పేట్ 28.4, బంట్వారం 6.2, పెద్దేముల్ 8.2, తాండూరు 2.2, బషీరాబాద్ 12, బషీరాబాద్ 19.2, కొడంగల్లో 7 మి.మీల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కులకచర్ల మండలం పుట్టాపహాడ్ గ్రామంలో 80.8 మి.మీ వర్షం కురిసింది.
కొడంగల్ మండలం కస్తూర్పల్లి గ్రామానికి చెందిన భీమమ్మ ఇల్లు వర్షపు నీటికి గోడ నాని ఓ పక్క కూలిపోయింది. ప్రభుత్వం కనికరించి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని వేడుకొంటున్నది. కురుస్తున్న వర్షాలతో రాకపోకలకు ఇబ్బందిపడుతున్నామని, అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని అప్పాయిపల్లి గ్రామపంచాయతీ పరిధి ఆశమ్మకుంటతండా గిరిజనులు కోరుతున్నారు. పోచమ్మతండా గ్రామపంచాయతీ పరిధిలోని మైసమ్మతండా వాగు నిండి ఆదివారం రాత్రి నుంచి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయినట్లు సర్పంచ్ శంకర్నాయక్ తెలిపారు. అధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మాణం చేపట్టి తండావాసుల ఇబ్బందిని తొలగించాలని కోరారు.
పరిగిలోని గంజ్రోడ్డులో వర్షపు నీరు వెళ్లడానికి సోమవారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్ అశోక్ దగ్గరుండి పనులు చేయించారు. గంజ్రోడ్డులోని మార్కెట్ గేట్ వద్ద గతంలో నిర్మాణం చేపట్టిన మురికికాలువలో పేరుకుపోయిన మట్టిని జేసీబీ సహాయంతో తీయించారు.