వికారాబాద్, జూలై 11, (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ కేంద్రంలో 57 రకాల రక్త పరీక్షలు చేసే విధంగా అత్యాధునిక యంత్ర పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి జూన్ 1వ తేదీన జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించారు. ఇప్పటి వరకు 29 రోజుల్లో 1274మందికి పరీక్షలు నిర్వహించారు. సేవలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా విస్తరిస్తున్నది. మధుమేహం, థైరాయిడ్, లివర్ ఫంక్షనింగ్, రీనల్ ఫంక్షన్, లిపిడ్, సీరం, ఎలక్ట్రోలైట్స్, ఫాథాలజీ(సీబీపీ), మైక్రో బయోలజీ, ఇతర కేటగిరీల్లో రక్త పరీక్షలు చేస్తున్నారు.
దవాఖానల్లో రక్తనమూనాల సేకరణ..
మూడు జిల్లాల పరిధిలోని 32 పీహెచ్సీలు, సీహెచ్సీలతో పాటు జిల్లా దవాఖాన నుంచి సేకరించిన రక్త నమూనాలను ప్రత్యేక వాహనాల ద్వారా టెక్నీషియన్లు ఇక్కడకు తీసుకువస్తారు. ఇక్కడ పరీక్షలు చేసిన వెంటనే రిపోర్టు కాపీలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. రక్త నమూనాలు ఇచ్చిన రోగులు నేరుగా స్థానిక దవాఖానకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
ఖరీదైన వైద్య పరీక్షలు..
డయాగ్నస్టిక్ కేంద్రంలో నూతనంగా ఖరీదైన పరీక్షలు హెచ్బీఏ1సీ, డీ డైమర్, ఎల్డీహెచ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హెచ్బీఏ1సీ (హిమోగ్లోబిన్ ఏ1సీ లేదా ైగ్లెకేటెడ్ హిమోగ్లోబిన్)గా పిలుస్తారు. మధుమేహం ఎంత వరకు ఉందని నిర్ధారించడంతో పాటు పరిగడుపున ప్లాస్మా గ్లూకోజ్ పరీక్షతో కలిసి టైప్-2 షుగర్(మూడు నెలల)నిర్ధారణ చేస్తారు. లాక్టేడ్ డీ హైడ్రోజినేస్ (ఎల్డీహెచ్)పరీక్ష కణజాలల్లో మనకు కలిగే నష్టం అంచనా వేస్తున్నది. అంటువ్యాధులు, రక్త హీనతలు, మూత్ర పిండాల వ్యాధి, కాలేయం ఎలా ఉందనే దానిపై పరీక్ష ద్వారా అంచనా వేసుకోవచ్చు. యాంటీబాడీస్ మనశరీరంలో ఏమేరకు ఉన్నాయని గుర్తిస్తారు. డీ డైమర్ పరీక్షతో గుండే సంబంధిత వ్యాధులను గుర్తిస్తారు. రక్తం గడ్డకట్టిన సమయంలో డీ డైమర్ పరీక్ష అవసరముంటుంది.
వైద్యులు అంచనాకు వచ్చాక పరీక్షలు..
రోగ నిర్ధారణ రక్త పరీక్షల ఆధారంగా వైద్యులు మనలోని ఆరోగ్య స్థితిగతులను అంచనా వేస్తారు. జ్వరం, అస్వస్థత, నీరసం కండ్లు తిరగడం, కాళ్లు, ఒంటి నొప్పులు ఇలా అనేక రకాల ప్రశ్నలతో వైద్యులు మనలో జబ్బును గుర్తిస్తారు. దీనిపై ఓ అంచనాకు వచ్చాక అనుమానం కలిగితే వివిధ రకాల రక్త, స్కానింగ్ పరీక్షలకు రెఫర్ చేస్తారు. ఇక్కడే పేద, మధ్య తరగతి ప్రజలపై ఆర్థికభారం పడుతున్నది. వందల నుంచి వేల రూపాయలు ఖర్చు చేసే పరీక్షల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా 57 రకాల రక్త పరీక్షలు చేసేందుకు జిల్లా కేంద్రంలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసింది.
1274 మంది రోగుల నుంచి శాంపిళ్ల సేకరణ
ఇక్కడ ఏర్పాటు చేసిన నాటి (29 రోజుల) నుంచి నిర్వహించిన పరీక్షల్లో 1274 మంది రోగుల నుంచి 2367 శాంపిళ్లను సేకరించారు. 3312 మందికి సంబంధించిన రోగులకు పరీక్షలు నిర్వహించారు. 21,203 ప్యారామీటర్స్ కౌంట్స్ నిర్వహించారు. ఈ పరీక్షలు ప్రైవేట్లో వెళ్లి చేయించుకుంటే సుమారు రూ.4500-5000 వరకు ఖర్చు భరించాల్సి వస్తుండేది. ఈ లెక్క దాదాపుగా రూ.65 లక్షల నుంచి రూ.70లక్షల వరకు సామాన్య, పేద,మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం తప్పిందని వైద్యవర్గాలు వెల్లడించాయి.
మూడు జిల్లాలు.. 32 ప్రాంతాల నుంచి..
జిల్లాలో ఆరు రూట్లుగా విభజించారు. ప్రస్తుతం నాలుగు రూట్ల నుంచి శాంపిళ్లు ఇక్కడికి వస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని 22 ప్రాంతాల నుంచి ఆర్బీఎస్కే వాహనాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు రక్తనమూనాలను తీసుకువస్తున్నారు. 14 పీహెచ్సీ, 2 సీహెచ్సీల నుంచి ప్రస్తుతం ఇక్కడి తీసుకువస్తున్నారు. చిట్యాల, దోమ, కులకచర్ల, పూడూర్, చన్గోముల్, సిద్దులూర్, మోమిన్పేట్, నవాబ్పేట్, రామయ్యగూడ, మర్పల్లి, పెద్దెముల్, ధారూర్, నాగసముద్రం, కోట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కాగా.., పరిగి, వికారాబాద్ సీహెచ్సీలకు సంబంధించినవి సేకరిస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలోని ఆలూరు, చందన్వెల్లి, చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి, టంగటూర్, కొందుర్గు, సంగారెడ్డి జిల్లా మల్చెల్మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించిన రూట్లు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి. బంట్వారం, బషీరాబాద్, బొంరాస్పేట, కొడంగల్, దౌల్తాబాద్, అంగడిరాయ్చూర్, నవల్గా, యాలాల్, జిన్గుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కూడా మొదలు పెట్టానున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రం సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా దవాఖానతో పాటు మూడు జిల్లాల పరిధిలోని 32 ప్రాంతాల నుంచి శాంపిళ్లు సేకరిస్తున్నాం. సీహెచ్సీ, పీహెచ్సీలకు వెళ్లి డాక్టర్ల రెఫర్ మేరకు రక్త పరీక్షలు చేసుకోవాలి. వికారాబాద్ జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదు. స్థానికంగా ల్యాబ్ టెక్నీషియన్లు రక్తనామూనాలు సేకరించి వాటిని డయాగ్నస్టిక్ కేంద్రానికి పంపిస్తారు. పరీక్షల అనంతరం రిపోర్టు కాపీలను సంబంధిత దవాఖాన వెబ్సైట్లో పంపిస్తాం.
-బిజలీల్, డయాగ్నస్టిక్ కేంద్రం ఇన్చార్జి,వికారాబాద్ జిల్లా