తాండూరు, జూలై 9: టీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో 2 వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి వెల్లడించారు. శుక్రవారం తాండూరులో నిర్వహించిన మీడియా సమా వేశంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో తమ ఆధ్వర్యంలో తాండూరు నియోజక వర్గంలో రెండు వేల కోట్ల నిధులతో తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా కాగ్నా వంతెన, రోడ్లు, డిగ్రీకళాశాల భవనం, మాత శిశు ఆస్పత్రి, మున్సిపల్ భవనం, మైనార్టీ రెసిడెన్షియల్తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. పూర్తయిన నిర్మాణాలను 10 రోజుల్లో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందుకు తగ్గ ఏర్పాట్లును చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రావుఫ్, ఫ్లోర్లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు నీరజ, రాము, రవిరాజు, వెంకన్నగౌడ్, పార్టీ నేతలు రవిగౌడ్, శ్రీను, మసూద్, రకేశ్, రఘు తదితరులున్నారు.
ఎమ్మెల్యే రోహిత్రెడ్డి చొరవతో అభివృద్ధి వేగం…
తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి ప్రత్యేక చొరవతో తాండూరు నియో జకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్ పేర్కొన్నారు. తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్నాయక్ మాట్లాడుతూ ఎన్నో రోజులుగా కొంటుపడిన పనులను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, సబితా రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వెంటపడి పనులు వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా తాండూరులో అందరితో కలిసి కట్టుగా ఉంటూ గతంలో ముందెన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పాలన చేస్తున్నట్లు తెలిపారు. తాండూరులో పూర్తయిన రూ.60 కోట్ల అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దీప తదితరులున్నారు.