వికారాబాద్, జూలై 7, (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఈసారి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో నిలిచాయి. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీఎస్, మార్కెటింగ్ శాఖ ద్వారా అంచనాలకు మించి ధాన్యం సేకరించారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కొనుగోళ్లు జరిగాయి. యాసంగి కొనుగోళ్ల ప్రారంభం సందర్భంగా జిల్లాలో 195 కేంద్రాలను లక్ష్యంగా పెట్టి 192 కేంద్రాలు ప్రారంభించారు. ఏప్రిల్ నుంచి కొనుగోళ్లను ముమ్మరం చేసి దాదాపుగా రెండు నెలల పాటు (జూన్ నెలాఖరు వరకు) సేకరించారు.
ముందస్తు అంచనా..
ఈ యాసంగిలో అంచనాలను మించి వరి సాగు కావడంతో దిగుబడిని ముందుగానే అంచనా వేసిన అధికారులు, ఆ మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. రెండు నెలల పాటు సాగిన కొనుగోలు కేంద్రాలకు రైతులు భారీగా ధాన్యం తీసుకొచ్చారు. 23,496 మంది రైతుల నుంచి రూ.238 కోట్ల 44 లక్షల విలువైన లక్షా 26వేల 289 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్) ద్వారా రూ.12,976 మందికి రూ.136 కోట్లు జమచేశారు. ఇంకా రూ.102.44 కోట్లు జమ కావాల్సి ఉంది. నిరంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు మిల్లర్లతో సమీక్షలు నిర్వహించి రైతులకు ఇబ్బందులు లేకుండా విజయవంతంగా ధాన్యం సేకరించారు. దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ.238 కోట్ల 44లక్షల విలువైన వరి పంటను జిల్లా రైతులు పండించారు. గత యాసంగిలో 44,025 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు.
మరో మూడు జిల్లాలకు.. మన బియ్యం
జిల్లాలో ధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. దీంతో వికారాబాద్ జిల్లాతో పాటు మరో మూడు జిల్లాలకు మన ధాన్యాన్ని సరఫరా చేశారు. వికారాబాద్తో పాటుగా రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు మన ధాన్యాన్ని తీసుకెళ్లారు. కరీంనగర్కు 13,500, నిజామాబాద్కు 10 వేల మెట్రిక్ టన్నులు తీసుకువెళ్లారు. కాగా రంగారెడ్డి జిల్లా, జిల్లాలోని గోదాంలకు తరలించారు. ఇవి జిల్లాలోని చంద్రకళ, జఫర్పల్లి, నంది ట్యూబ్ టైర్స్, తాండూరు మార్కెటింగ్, తాండూరు గోదాం, తాండూరు దాల్ మిల్లు, మోమిన్పేట ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్, రావులపల్లిలోని డీఎస్ఆర్ ఫంక్షన్, మర్పల్లి, పెద్దేముల్ తదితర ప్రాంతాల్లోని గోదాంలు, ఫంక్షన్ హాళ్లలో భద్రపర్చారు. 23,496 రైతుల నుంచి 1.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తీసుకుని, సీఎంఆర్ (కస్టం మిల్లింగ్) కోసం రైస్ మిల్లులకు పంపించారు.
అన్ని కేంద్రాలు మూసివేత
జిల్లాలో 192 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, ఏఎంసీల ద్వారా ఈ కొనుగోలు చేపట్టారు. వీటి ద్వారా 23,496 రైతుల నుంచి 1.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అన్ని చోట్ల కొనుగోళ్లు పూర్తిచేశారు. అనంతరం 192 కేంద్రాలను అధికారులు మూసివేశారు.
పెరిగిన దిగుబడి
జిల్లాలో ఈ యాసంగిలో 23,496 మంది రైతుల నుంచి 192 కేంద్రాల ద్వారా 1,26,289 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 78 కేంద్రాల ద్వారా 10,324 మంది రైతుల నుంచి 50.21వేల మెట్రిక్ టన్నులు, 49 పీఏసీఎస్ కేంద్రాల ద్వారా 6,563 మంది రైతుల నుంచి 35.92 వేల మెట్రిక్ టన్నులు, 61 డీసీఏంఎస్ కేంద్రాల ద్వారా 5,886 మంది రైతుల నుంచి 37.57 వేల మెట్రిక్ టన్నులు, 4 మార్కెటింగ్ కేంద్రాల ద్వారా 723 మంది రైతుల నుంచి 4వేల 118.560 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. సెప్టెంబర్ 20 నాటికి ఈ బియ్యాన్ని రైసు మిల్లర్లు పౌరసరఫరాల శాఖకు అందజేయాల్సి ఉంటుంది.