వికారాబాద్, జూలై 5, (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ సిరిసిల్ల పర్యటనలో భాగంగా 57 ఏండ్ల వారికి త్వరలో పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పడంతో అర్హుల్లో ఆశలు రేకెత్తిస్తున్నది. గతంలో వృద్ధాప్య పింఛన్ వయస్సును 57 ఏండ్లకు కుదిస్తూ ఆసరా మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతో రెండేండ్ల కిందట 57 నుంచి 64 ఏండ్ల మధ్య అర్హులను అధికారులు గుర్తించి, జాబితాను తయారుచేశారు. వికారాబాద్ జిల్లాలోని 18 మండలాలు, 4 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 96,569 మంది వివిధ కేటగిరీల్లో పింఛన్లు పొందుతున్నారు.
అర్హులను గుర్తించిన అధికారులు
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ల సాయాన్ని భారీగా పెంచారు. దివ్యాంగులకు రూ.3016, వృద్ధులు, వితంతువు, ఒంటరి మహిళ, బోదకాలు, గీత, బీడీ కార్మికులకు రూ.2016 చెల్లిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో అన్ని కేటగిరీలకు సంబంధించి 96,569 మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. జిల్లాకు ప్రతి నెలా సుమారు రూ.20 కోట్లకు పైగా ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. పింఛన్ సాయం అధికంగా పెంచడంతో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం 65 ఏండ్లు నిండిన వారికి వృద్ధాప్య పిం ఛన్లు మంజూరు చేస్తున్నారు. దీంతో జిల్లాలో 13,371 మంది అర్హులను గుర్తించి జాబితాలను కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదించారు.
మరో 5 వేలకుపైగా దరఖాస్తులు
ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, దివ్యాంగులు, వితంతువులు.. ఇలా చాలా మంది పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 5వేల మంది దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు అర్హులుగా గుర్తించారు. కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి జాబితా పంపించారు. వీరితో పాటు వివిధ కేటగిరీలకు చెందిన మరో 1000 మంది దరఖాస్తులు మండల స్థాయిలో పరిశీలించి గ్రామీణాభివృద్ధి శాఖలో లాగిన్లో పంపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం వెయింటింగ్లో ఉన్నారు.
13,371 మంది అర్హులు
జిల్లా వ్యాప్తంగా 13,371 మంది వృద్ధాప్య పింఛన్లకు అర్హులుగా గుర్తించాం. దివ్యాంగులకు రూ.3016, వృద్ధులు, వితంతువు, ఒంటరి మహిళ, బోధకాలు, గీత, బీడీ కార్మికులకు రూ.2016 ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే జిల్లాలో 96,569 మంది ఆసరా పింఛన్లు పొందుతున్నారు. జిల్లాకు ప్రతి నెలా సుమారు రూ.20 కోట్ల మేర ప్రభుత్వం మంజూరు చేస్తున్నది.
– కృష్ణన్, డీఆర్డీవో పీడీ, వికారాబాద్