అబ్దుల్లాపూర్మెట్ : వాన వరుసగా కురుస్తుండటంతో విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా వచ్చి చేరింది. ఆదివారం బాటసింగారం-ఇనాంగూడ వద్ద వరద నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అబ్దుల్లాపూర్మెట్ చింతలచెరువు, బాటచెరువు అలుగు పారడంతో ఆ నీరంతా రహదారిపైకి చేరడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్థంభించి పోయింది. రహదారి పూర్తిగా చెరువులా మారడంతో వాహనదారులు భయం భయంతో రోడ్డు దాటుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని వర్షాన్ని లెక్క చేయకుండా శ్రమించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.