దౌల్తాబాద్ : మండలంలోని దేవర్ఫసల్వాద్-మోగల్మడ్క వెళ్లే ప్రధాన రహదారిలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్ మండలంలోని భాగ్యతండాకు చెందిన సబావత్ రామునాయక్ నూతన ట్రాక్టర్ను రిజిస్ర్టేషన్ నిమిత్తం పరిగి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు. అలాగే నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మోగల్మడ్క గ్రామానికి చెందిన పోతుల బీములు వదిన మంజూలను టీఎస్06ఈయు9208 బైక్పై తీసుకుని నారాయణపేట జిల్లా మద్దూర్కి చికిత్స నిమిత్తం వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో దేవర్ఫసల్వాద్-మోగల్ మడ్క వెళ్లే ప్రధాన రహదారిలో ట్రాక్టర్ బైక్ను ఢీకొట్టింది.
దీంతో చంటి పిల్లవాడు శివనంద్ (45 రోజుల), బాలింత ఇద్దరూ ట్రాక్టర్ టైర్ల కింద ఇరుక్కున్నారు. దీంతో శివనంద్ అక్కడికక్కడే మృతి చెందగా బాలుడి తల్లీ కాలు విరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చెరుకుని ట్రాక్టర్ను పోలీస్టేషన్ తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ ఉస్మాన్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయబడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.