షాద్నగర్ : నిర్దేశించిన గడువులో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడారు. మండల కేంద్రాల్లో గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతి ద్వారా చేపట్టిన హరితహారం నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, చెత్త డంపింగ్ యార్డుల వంటి పనులను పూర్తి చేయాలని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్ణిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పూర్తిచేయకుంటే అధికారులపై చర్యలు తప్పవన్నారు.
గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనులు చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీలకు కేటాయించిన బడ్జెట్లో 10శాతం నిధులను హరితహారం మొక్కల సంరక్షనకు వినియోగించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ నెల 15నుంచి అక్టోబర్ 2 వరకు అన్ని గ్రామాల్లో స్వచ్ఛతా హీ సేవను నిర్వహించాలని కోరారు. ఇందులో భాగంగానే శ్రమధానం, ప్లాస్టిక్ నిర్మూలణ, తడి పోడి చెత్త నిర్వాహణ, మురుగు కాలువల శుభ్రత, మరుగు దొడ్ల నిర్వాహన వంటి అంశాలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు.
స్వచ్ఛతా హీ సేవాలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని స్వరాజ్యలక్ష్మీ, సంక్షేమ శాఖ అధికారిని మోతీ, డీఆర్డీఏ పీడీ ప్రభాకర్, డీపీఓ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈఓ దిలీప్కుమార్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.