వికారాబాద్ : గ్రామంలోని ప్రైవేటు స్థలంలో నిర్వహిస్తున్న హరితహారం నర్సరీని ప్రకృతివనంలోకి మార్చాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమిబసు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వికారాబాద్ మండల పరిధిలోని పాతూర్ గ్రామాన్ని సందర్శించి పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మాణపు పనులను, గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఒక ఎకర స్థలంలో పల్లె ప్రకృతి వనంలో మొక్కలు భాగున్నాయని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పౌసుమిబసు మాట్లాడుతూ హరితహారం నర్సరీని ప్రకృతివనంలోకి మార్చాలని, ఇందుకు అవసరమైన నీటి సదుపాయం కోసం బోరు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
ఖాళీగా ఉన్న స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి రోజు గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణ సక్రమంగా నిర్వహించాలని సర్పంచ్, కార్యదర్శులకు సూచించారు. డంపింగ్ యార్డుకు ముండ్ల మొక్కలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలోని వీధులతో పాటు ఇంటింటా తిరిగి నీరు నిలువకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. నిరూపయోగంగా ఉన్న వస్తువులలో వర్షపు నీరు నిలువకుండా చూడాలని తెలిపారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు వహించాలని ప్రజలకు సూచించారు. గ్రామంలో 30 సంవత్సరాలు పైబడిన వారిని గుర్తించి మధుమేహం, హై టెన్షన్ వ్యాధులను గుర్తించి వారికి వైద్య సేవలు అందేటట్లు చూడాలని ఆశ వర్కర్లను ఆదేశించారు.
నిర్మాణంలో ఉన్న వైకుంఠధామం పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలు (జాబ్కార్డు హోల్డర్స్) తెలియజేసే రిజిస్టర్ను, గ్రామ సభలు నిర్వహించే రిజిస్టర్లను పరిశీలించారు. దారిలో వెళుతుండగా హనుమంత్రెడ్డి అనే యువ రైతును కలెక్టర్ పలకరించి ఈసారి ఏ పంట వేస్తున్నావని అడుగగా, రైతు స్పందిస్తూ తన 5 ఎకరాల్లో పొలంలో వాము పంట వేస్తున్నామని తెలిపారు. ఇంతకు ముందు పత్తి పంట వేస్తుంటిని, పంట మార్పిడి చేయడం వలన అధిక లాభాలు వస్తున్నాయని కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో డీఆర్డీవో కృష్ణన్, ఎంపీడీవో సుభాషిణి, సర్పంచ్ లలితమ్మ, వికారాబాద్ ఎంపీపీ చంద్రకళ, గ్రామ కార్యదర్శి సుహాసిని, ఏపీఎం సురేష్ పాల్గొన్నారు.