నందిగామ : మహిళ, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం నందిగామ మండలం మేకగూడ గ్రామంలో నాట్కో ట్రస్ట్ ఆర్థిక సహకారంతో రూ. 20లక్షల వ్యయంతో నిర్మించిన నూతన అంగాన్వాడీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం సంఘీగూడ గ్రామంలో నాట్కో ట్రస్ట్ సహకారంతో నిర్మిస్తున్న అంగాన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం 45రోజుల నుంచి 9నెలల వయస్సు ఉన్న చిన్న పిల్లలకు (పీసీసీ) నిమోనియా టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే పిల్లలకు మంచి పోషనతో కూడిన ఆహారం అందించడం ద్వారా పిల్లలలో చిన్న వయస్సు నుంచే రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారన్నారు. అంగాన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారన్ని క్రమం తప్పకుండా పిల్లలకు అందించాలని సూచించారు. వ్యాధులు ప్రభలకుండా పిల్లలకు టీకాలు వేయించాలని సూచించారు. నాట్కో ట్రస్ట్ సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం సంఘీగూడ గ్రామానికి చెందిన మరిపల్లి యాదయ్యకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో మేకగూడ సర్పంచ్ పాండురంగారెడ్డి, మేకగూడ పీఏసీఎస్ చైర్మన్ మంజులరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నోముల పద్మారెడ్డి, ఎంపీటీసీ రాజునాయక్, జిల్లా వెల్పేర్ అధికారి మోతి, సీడీపీవో నాగమణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, నాట్కో ట్రస్ట్ మేనేజర్ రాంబాబు, సూర్యనారాయణ, నాయకులు నర్సింహులు, మేకం రాజు, శ్రీశైలం పాల్గొన్నారు.