షాద్నగర్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర విద్యాభివృద్ధిపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం షాద్నగర్ పట్టణంలో నూతనంగా నిర్మించే గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కుంట్ల రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏడు యేండ్ల కాలంలో రాష్ట్ర విద్యావ్యవస్థ ఎంత బలోపేతం అయ్యిందో దేశానికి మొత్తం తెలిసిన స్థానిక కాంగ్రెస్ నాయకులకు తెలువడంలేదని ఎద్దేవా చేశారు.
మన రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల విద్యవిధానం అమలుపై ఇతర దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాల ప్రతినిధులు కొనియాడుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం జీర్ణీంచుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. గత పాలనలో ఇంజినీరింగ్ కళాశాలలు కోళ్ల ఫాంముల్లో ఉండేవని, నేడు ఆ పరిస్థితి ఉందా? అని కాంగ్రెస్ నాయకులను ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలిస్తున్నాయని, ఇతర రాష్ట్రాల సీఎంలు సహితం మన విద్యా విధానంపై ప్రశంసాలు కురిపిస్తున్నారని అన్నారు. ఒక్కొ విద్యార్థికి రూ. 1.25లక్షలు ఖర్చుచేస్తున్నామని, నేడు గురుకులాల్లో 4లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారనే విషయాన్ని గ్రహించాలని సూచించారు.
బాలికల శ్రేయస్సు దృష్ట్య రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 53మహిళా డిగ్రీ కళాశాల లను ఏర్పాటు చేశామని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిగ్రీ కళాశాలలను అందుబాటులోకి తెచ్చామని అన్నారు. 12మెడికల్ కాలేజీలను నూతనంగా స్థాపించామని, ప్రస్తుతం రాష్ట్రంలో 986 జూనియర్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. ఎస్టీల కోసం ప్రత్యేకంగా లా కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అబద్ధం మాటలను మానుకుంటే కాంగ్రెస్ నాయకులకు మంచిదని సూచించారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం అన్ని ప్రాంతాల్లో స్టడీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గురుకుల కళాశాలల్లో చదివిన విద్యార్థులు 153మంది ఈ యేడు మెడికల్ సీట్లను పొందారన్నారు.
ప్రతి యేటా రూ. 4వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విద్యా శాఖకు ఖర్చు చేస్తుందని వివరించారు. అదే విధంగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తుంటే ప్రతిపక్ష పార్టీల నేతలు అర్థం లేని ఆరోపనలు చేయడం సరికాదని మండిపడ్డారు. మన ప్రాంతం అభివృద్ధి చెందేందుకు సహకరించాలే తప్పా అడ్డుకునేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మ శ్రీధర్, రాష్ట్ర మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ నాగేందర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నె కవిత నారాయణ, మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
రూ. 1.88 కోట్లతో గ్రంథాలయ భవనం
షాద్నగర్ పట్టణంలో రూ. 1.88 కోట్ల నిధులను వెచ్చించి నూతనంగా గ్రంథాలయ భవనాన్ని అత్యాధునికంగా నిర్మిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మ శ్రీధర్, రాష్ట్ర మౌళిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ నాగేందర్గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగానే భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఏడాది కాలంలో భవనం పాఠకులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు.