ఇబ్రహీంపట్నం : పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని తెలంగాణ క్రషర్స్ అసోసియేషన్ నాయకులు కమలాకర్రెడ్డి, నందారెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి అన్నారు. తెలంగాణ క్రషర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9 అంబులెన్స్లను బుధవారం రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేతుల మీదుగా ప్రారంభించి ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా క్రషర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ వైద్యానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక దృష్టిసారించారన్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలోని క్రషర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు తక్షణ వైద్య సేవలందించేందుకు కోసం 9 అంబులెన్స్లను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వానికి ప్రత్యేకంగా అంబులెన్స్లు అందజేసిన క్రషర్స్ యూనియన్ నాయకులు కమలాకర్రెడ్డి, బూడిద నందారెడ్డిలతో పాటు రంగారెడ్డిజిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బూడిద రాంరెడ్డిను మంత్రి తారకరామారావు అభినందించారు.