కృష్ణానది తీరంలోని ఇర్కిగూడెం అంతా రాతినేలతో నిండిపోయింది. ఈ గ్రామంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా ఇబ్బందులే. మొక్కలు కూడా అంతగా ఎదగలేవు. అయినప్పటికీ అధికారులు, గ్రామ సర్పంచ్ ప్రత్యేక చొరవతో బండలను తొలగించి నిర్మాణాలు చేపట్టారు. కృష్ణానది తీరంలోని రూ.12.60లక్షల వ్యయంతో చేపట్టిన వైకుంఠ
ధామంతో పాటుగా డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణానికి తీవ్రంగా కష్టపడ్డారు. పెద్ద పెద్ద బండలను తొలగించి నిర్మాణాలు పూర్తి చేశారు. రంగులు వేసి సకల హంగులతో ముస్తాబు చేశారు. మరోవైపు హరితహారంలో మొక్కలను కూడా నాటి సంరక్షిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం..
గ్రామ శివారులో రెండెకెరాల్లో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. దీనితో పాటుగా నర్సరీ ద్వారా మొక్కలను పెంచుతున్నారు. రోడ్డు వెంటనే పూర్తి చేసుకున్న పల్లె ప్రకృతి వనం చూపరులను ఆకర్షిస్తున్నది. పూల మొక్కలు, దుబాయ్ టేకు, గులాబీ, ఆయుర్వేద, పండ్ల మొక్కలను నాటించారు. ప్రతి రోజూ నీటిని అందిస్తూ మొక్కలను సంరక్షిస్తున్నారు. చుట్టూ ఫెన్సింగ్, గేటును అమర్చి మొక్కలకు కాపలా పెట్టారు.
గ్రామంలో మౌలిక వసతుల ఏర్పాటు..
గ్రామంలో మొత్తం 520కుటుంబాలు, 2వేల జనాభా ఉన్నది. రూ.15లక్షలతో సీసీరోడ్ల నిర్మాణం, 800మీటర్ల డ్రైనేజీలు, గ్రామం అంతా ఎల్ఈడీ బల్పులు పెట్టించారు. ఇంటింటికీ భగీరథ నీటిని అందిస్తున్నారు. ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశారు. వీధుల్లో, ఇంటింటికీ మొక్కలను నాటించారు. వీధుల్లో చెత్తకుండీలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి ఇంటికీ తడి, పొడి చెత్త బుట్టలను అందించి సేకరిస్తున్నారు. కృష్ణా పుష్కరాలకు ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లు, భగీరథ ట్యాంకు సమీపంలో శివయ్య విగ్రహం గ్రామానికే వన్నెతెస్తున్నాయి.
అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నా..
గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు పట్టుదలతో పనిచేస్తున్నాను. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నాము. మా గ్రామ పరిసరాలన్నీ రాతినేలలే. ఎంతో కష్టపడి రాళ్లను తొలగించి వైకుంఠధామం, డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేశాం. గ్రామస్తులు, నాయకుల సహకారంతో అభివృద్ధి సాధించి జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కించుకోవడం గర్వంగా ఉన్నది.