వికారాబాద్ : నూతన కలెక్టరేట్ భవనంలో మిగిలి ఉన్న చిన్న చితక పనులతో పాటు సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ నిఖిల సంబంధిత ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ నూతన సమీకృత కలెక్టర్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్యాలయ అంతర్ భాగంలో కాంపౌండ్వాల్ నిర్మించాలని సూచించారు. దీని నిర్మాణం వలన భవనానికి అందం వస్తుందన్నారు. పార్కింగ్ కోసం స్థల నిర్ధారణ చేసి అట్టి స్థలంలో పనులను వేగవంతం చేయాలన్నారు. ఖాళీగా ఉన్న మరో స్థలంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పార్కును ఏర్పాటు చేయాలని సూచించారు. భవనం ముందు ఉన్న మరికొంత ఖాళీ స్థలంలో గ్రీనరీ పెంచాలని తెలిపారు.
ఆవరణలో ఉన్న మట్టి దిబ్బలను, తాత్కాలిక నిర్మాణాలను, నిరూపయోగంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని సూచించారు. భవనం రెండో అంతస్తులో ఎస్హెచ్జీ మహిళా గ్రూపు సభ్యులకు క్యాంటిన్ స్థలం కేటాయించాలని, విజయ డైరీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్, మినిస్టర్ ఛాంబర్లు, మీటింగ్ హాల్, కలెక్టర్ క్యాంపు కార్యాలయం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్అండ్బీ ఈఈ లాల్సింగ్, డీఈ శ్రీధర్రెడ్డి, ఏఈ రవికుమార్, కలెక్టర్ కార్యాలయ ఏవో హరిత ఉన్నారు.