ఆమనగల్లు : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణంతో పాలమూరు రైతాంగానికి దశాబ్ద కాలంగా పట్టిన దరిద్రం పోతుందని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో సాగు జలాలపైన ప్రత్యేక దృష్టి సారించిన సీఎం కేసీఆర్కు మద్దతుగా ఉంటామని రైతులు పేర్కొన్నారు. మంగళవారం తలకొండపల్లి మండలంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి షాద్నగర్, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు రైతులు తరలివచ్చి తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం అంతా సాగు జలాలుగా మారి పంటపొలాలు సస్యశామలం అవుతాయని అన్నారు. ఆంధ్ర పాలనలో ప్రాజెక్టుల పేర్లు చెప్పి నిలువు దోపిడి చేసి ఓట్లు దండుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నారని వారు అన్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని రైతులు ప్రభుత్వానికి విన్నవించారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
కాళేశ్వరం ప్రాజెక్టును ఎలాగైతే పూర్తి చేశారో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అదే విధంగా పూర్తి చేయాలి. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల్లోని రైతాంగా నికి లబ్ధి కలుగుతుంది. ప్రాజెక్టులు పూర్తయితే రైతులంతా సీఎం కేసీఆర్కు మద్దతుగా ఉంటారు.