సూర్యాపేట సిటీ, డిసెంబర్ 28 : జిల్లా పోలీసులు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సమాచార వనరులను పెంచుకోవడంతో అక్రమ రవాణాను నివారించాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పలు సందర్భాల్లో తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లా గుండా హైదరాబాద్, ముంబై వంటి మహానగరాలకు గంజాయి సరఫరా అవుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. దాంతో రూటు మార్చిన మత్తుగాళ్లు గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. 2020లో గంజాయి కేసులు 12 మాత్రమే నమోదు కాగా, 2021లో 64 కేసులు నమోదు చేసి 12 టన్నుల గంజాయిని సీజ్ చేశారు. 150 మందిని అరెస్ట్ చేసి ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. 2021లో నేరాలు సంఖ్యాపరంగా పెద్ద తేడా లేకపోయినా రికవరీ పెరిగింది. ప్రమాదాలు తగ్గి ఫిర్యాదుల సంఖ్య పెరిగింది.
పెరిగిన రికవరీ
2021లో 218 కేసులు నమోదు కాగా, 2021లో 313 కేసులు నమోదు చేశారు. 2022లో ఒకటి, రెండు కేసుల్లోనే భారీ రికవరీ కాగా, 2021లో ఎక్కువ కేసులను ఛేదించారు. 2020లో 218 కేసులు నమోదు చేయగా, 124 కేసులను పరిష్కరించారు. 2021లో 193 కేసులు ఛేదించి 98.6 లక్షల సొత్తును రికవరీ చేశారు.
తగ్గిన రోడ్డు ప్రమాదాలు
2021లో జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆశాజనకంగా తగ్గింది. 2020లో 453 ప్రమాదాలు జరుగగా 2021లో 400 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2020లో 203 మంది మరణించగా 464 మంది క్షతగాత్రులయ్యారు. 2021లో మరణాలు 195, క్షతగాత్రుల సంఖ్య 428కి తగ్గాయి. వాహనదారులకు తరచూ అవగాహన కల్పించడంతోనే నేరాలు తగ్గుముఖం పట్టాయి. 2020లో 55 గుట్కా కేసుల్లో 31లక్షల విలువైన నిషేధిత పొగాకు పదార్థాలు సీజ్ చేయగా 2021లో 57 కేసుల్లో 40లక్షల విలువైన వాటిని సీజ్ చేశారు. పీడీఎస్ బియ్యం విషయంలో 2020లో 85 కేసులు, 2400 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేయగా, 2021లో 160 కేసుల్లో 3350 క్వింటాళ్ల బియ్యం సీజ్ చేశారు. 2021లో ఫిర్యాదుల సంఖ్య, మోటార్ వెహికిల్ యాక్ట్ కేసులు డ్రంకెన్ డ్రైవ్, మిస్సింగ్ కేసులు, వాహన తనిఖీలు పెరగ్గా ఇసుక అక్రమ రవాణా, లైంగికదాడులు తగ్గాయి. 2021లో జిల్లాలో నకిలీ టీ పొడి తయారు చేస్తున్న 26 మందిని అరెస్టు చేసి వారి నుంచి 23 లక్షల విలువైన 45.5 క్వింటాళ్ల నకిలీ టీ పొడిని సీజ్ చేశారు. చారిత్రాత్మక సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేసిన 2 అంతర్రాష్ట్ర ముఠాలను అరెస్టు చేసి 30 లక్షల విలువైన పురాతన పంచలోహ గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయడంతోనే జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణాను అరికట్టగలిగినట్లు ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
రివార్డులతో ఉత్సాహం
జిల్లా ఎస్పీగా రాజేంద్రప్రసాద్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సిబ్బందికి అక్రమ రవాణా నివారణపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అక్రమ రవాణాను అరికట్టిన సిబ్బందికి అభినందనలతోపాటు రివార్డులు అందజేశారు. ప్రతి కేసు ఛేదనలో సిబ్బందిని అభినందించారు. దాంతో కేసుల ఛేదనలో ఉత్సాహంగా పని చేస్తున్నారు.