షాబాద్ : పూజల మాసమైన శ్రావణం మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. హిందూవులకు పవిత్రమాసం కావడంతో అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాలు, కఠోర ఉపవాసాలను నియమ నిష్టలతో నిర్వర్తిస్తారు. ఈ మాసంలో సోమవారం శివుడు, మంగళవారం మహాగణపతి, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వేంకటేశ్వరస్వామి, ఆదివారం సూర్యుడికి ఇలా ప్రతిరోజు విశిష్టత కలిగి ఉంటుంది. ఆగస్టు 9శ్రావణ శుద్ధ పాడ్యమి సోమవారంతో ప్రారంభమై సెప్టెంబర్7 అమావాస్యతో శ్రావణ మాసం ముగియనుంది. శ్రావణ మాసం వ్రతాలు, పూజలు, ఉపవాసాలకు పెట్టింది పేరు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు.
మంగళగౌరి వ్రతం
నిండు నూరేళ్ల సౌభాగ్యవతిగా ఉండాలని, మంచి సంతానం కలుగాలని కోరుతూ నూతన వధువులు ఈ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతం నిర్వహిస్తారు. అన్యోన్య దాంపత్యం, మంచి సంతానం కలగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహం జరిగిన మొదటి ఐదేండ్ల పాటు ఈ మాసంలో ప్రతి మంగళవారం వ్రతం చేపడతారు.
నాగుల పంచమి
సర్ఫదోషాలు తొలిగిపోవడానికి శ్రావణ శుద్ధ పంచమి (ఆగస్టు13) రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు. పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. వెండితో నాగప్రతిమలు చేసి పుట్టల్లో వదులుతారు.
వరలక్ష్మీ వ్రతం
అష్ట ఐశ్యర్యాలు ప్రసాదించి సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరుతూ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం(ఆగస్టు 20)న వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు.
రక్షాబంధన్
సోదర సోదరీమణుల బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్(ఆగస్టు 22)న జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరుల క్షేమం కోసం రాఖీ కడతారు. ఇదే రోజున జంధ్యాల పౌర్ణమిని కూడా జరుపుకుంటారు. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు.
శ్రీ కృష్ణాష్టమి
శ్రావణ బహుళ అష్టమి రోజున (ఆగస్టు 30)న శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కృష్ణుడిని ఊయాల్లో వేసి ఉత్సవాలను నిర్వహిస్తారు. చిన్నారులను గోపికలు, కృష్ణులుగా అలంకరించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఇలా శ్రావణ మాసాంతం వ్రతాలు, ఉపవాసాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది.