మైలార్దేవ్పల్లి,ఏప్రిల్ 22 : కాటేదాన్ ఇండోర్ స్టేడియం పనులను తొందరగా పూర్తి చేయాలని గ్రేటర్ జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజినీర్ దత్తుకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్గౌడ్ సూచించారు. గురువారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని కాటేదాన్ ఇండోర్ స్టేడియంలో గ్రేటర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు,సర్కిల్ అధికారులు పాల్గొన్నారు. ఏళ్లు గడుస్తున్న ఇండోర్ స్టేడియం పూర్తి కాకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో క్రీడామైదానం లేక క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. స్టేడియం పూర్తి కావడానికి మరో 10 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్ఈ ఎమ్మెల్యేకు వివరించారు.
స్టేడియంలో ఇప్పటి వరకు ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్పూల్ పనులు పూర్తి కావచ్చాయని, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ పనులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. ప్రధాన ద్వారం స్థలం పై ప్రైవేట్ వ్యక్తులు కోర్టుకు వెళ్లగా స్థలం యజమానితో చర్చలు జరిగాయి. మూడు కోట్లు చెక్కును అందజేయడానికి జీహెచ్ఎంసీ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా కొంత ఆలస్యం జరిగిందని అధికారులు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..స్టేడియం సమస్యలపై మంత్రి కేటీఆర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
స్కేటింగ్ రింగ్ సరిపోవడంలేదని దానిని విస్తరించాలని స్కేటింగ్ మాస్టర్ శంకర్, క్రీడాకారుల తల్లిదండ్రులు అధికారులను,ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ ఈఈ కిరణ్ ,రాజేంద్రనగర్ సర్కిల్ డీసీ జగన్ ,ఈఈ నరేందర్గౌడ్ ,టౌన్ ప్లానింగ్ ఏసీపీ రాణి, సర్కిల్ వర్క్ ఇన్స్పెక్టర్ రాహుల్ ,కాంట్రాక్టర్ అశోక్గౌడ్ ,సిరంగి బుచ్చయ్య, రుషివర్ధన్, పాటిల్, ఉష్కమూరి బాలు తదితరులు ఉన్నారు.