షాద్నగర్టౌన్ : అమావాస్య, శ్రావణమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలోని శివమారుతిగీతా అయ్యప్ప మందిరంలోని వీరభద్రస్వామి దేవాలయంలో లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి విశేష పూజలను నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసం చివరి అమావాస్య రోజున లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తామని తెలిపారు. అమావాస్య రోజున స్వామివారి పూజలు చేయడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. పట్టణానికి చెందిన కొట్టె వీరభద్ర వీరమణి దంపతులు అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
హరహర మహాదేవ శంభోశంకర
షాద్నగర్ మున్సిపాలిటీలోని అయ్యప్ప మందిరంలో శ్రీగిరిజామృత లింగేశ్వరస్వామివారికి సోమవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా దేవాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించడంతో పాటు సాయంత్రం సమయంలో నాగవల్లి దళార్చనతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అతి పవిత్ర శ్రావణ మాసంలో శివుడికి ఇష్టమైన సోమవారం రోజున భక్తితో పూజిస్తే శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. పట్టణానికి చెందిన లస్కర్ ఆంజనేయులు లక్ష్మి దంపతులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. నాగవల్లి దళార్చనలో దర్శనమిచ్చిన స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.