షాద్నగర్ : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన భాగ్యనగర ఉత్సవ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ మండపాల వద్ద భక్తులు కచ్చితంగా కొవిడ్ నిబందనలను పాటించాలని సూచించారు. మండపాల నిర్వాహాన పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదే అనే విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకునేందుకు సంబంధిత శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విగ్రహా నిమజ్జనోత్సవంలో ఎలాంటి అపశ్రుతులు జరుగకుండ అధికారులు చర్యలు తీసుకోవాలని, భక్తులు సహకరించాలని కోరారు. అధికారుల ఆదేశాలను కచ్చితంగా పాటించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ హరిప్రియ, డీసీపీలు, ఆర్డీఓలు, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు.