వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారి కోఠాజీ తెలిపారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020-21 సంవత్సరానికి గాను గిరిజన ఆర్థిక సహాకార సంస్థ నుంచి సబ్సిడీ ప్రతిపాదనలు కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా వచ్చాయన్నారు. వీటిని కలెక్టర్ ద్వారా జిల్లాలోని 18 మండలాలు, 4 మున్సిపల్లకు మంజూరు చేశామని తెలిపారు. వీటిని స్థానిక ఎంపీడీవోలు, బ్యాంకర్లు, కమిటీ సభ్యుల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు.
ఇప్పటి వరకు ఆన్లైన్లో 3,595 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా మొదటి విడుతలో 213 మందికి, రెండో విడతలో మరికొంత మందిని ఎంపిక చేస్తున్నమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ చంద్రకళ మాట్లాడుతూ లబ్ధిదారులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయలన్నారు. వృథా ఖర్చులు చేయకుండా కుటుంబ పోషణకు సహాయ పడేవిధంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుభాషిణి, కెనరాబ్యాంక్ మేనేజర్, మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ చెన్నారెడ్డి, ఏపీవో శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.