మొయినాబాద్ : సెప్టెంబర్ మొదటి వారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో పాఠశాలలను వంద శాతం శానిటైజేషన్ చేయాలని జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. శనివారం మండల పరిధిలోని చిలుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటి వారం నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో ఉపాధ్యాయులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యా బోధన చేయాలని సూచించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ గనుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్, సర్పంచ్ గునుగుర్తి స్వరూప, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, కారోబార్ రాజేష్కుమార్, టీఆర్ఎస్ నాయకులు ఆండ్రూ, జయవంత్ ఉన్నారు.