ఆమనగల్లు : దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ పార్టీ భవనానికి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణాన్ని పురస్కరించుకోని గురువారం పార్టీ ఆదేశాల మేరకు వాడావాడాలో టీఆర్ఎస్ జెండా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమనగల్లు పట్టణంతో పాటు మండలంలోని 13 పంచాయతీల్లో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలను ఏగురవేసి సంబురాలు జరుపుకున్నారు. ఆమనగల్లు పట్టణంతో పాటు సాకిబండతండాలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటంతో పాటు జయశంకర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.
మాడ్గుల మండలంలోని 32 పంచాయతీల్లో జెండా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వేడుకలను పురస్కరించుకొని ఆయా గ్రామాల్లో పార్టీ అధ్యక్షులు పార్టీ ముఖ్య నాయకులు పార్టీ జెండాలను ఆవిష్కరించారు.
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
కడ్తాల్ : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా కడ్తాల్ మండల కేంద్రంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.