వికారాబాద్ : గ్రామాల అభివృద్ధిలో రోడ్డు సౌకర్యం కీలక పాత్ర పోషిస్తాదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని డీఆర్సీ భవనంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్యక్షతన పీఎంజిఎస్వై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం భారత్కి ఆజాది కా అంరిట్ మహోత్సవ్ కర పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రధాన రోడ్ల నుంచి గ్రామాలకు లింక్ రోడ్లు అప్రోచ్ రోడ్లు చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. జిల్లా పరిషత్ ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే నిధులు ఇచ్చామని, ప్రస్తుతం సీసీ రోడ్లు కాకుండా బీటీ రోడ్లు అప్రోచ్ రోడ్లకు ఫార్మేషన్ రోడ్లకు మాత్రమే నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల జిల్లా పరిషత్ నిధుల ద్వారానే గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సభ్యులు మాత్రమే నిధులు అడగాలని సూచించారు. పరిగిలో అప్రోచ్ రోడ్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. మంజూరైన రోడ్ల నిర్మాణ పనులను క్వాలిటీతో నిర్మాణం చేయాలని సూచించారు. 250 జనాభా ఉన్న ప్రతి పల్లెకు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా మొరం రోడ్డు నిర్మాణానికి అవకాశం ఇవ్వడం శుభ పరిణామమన్నారు. గత సంవత్సరం వికారాబాద్ జిల్లాలో రూ. 50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులతో పాటు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి రావలసిన రూ. 20కోట్ల నిధులు సాంకేతిక కారణాల వల్ల జరుగలేదని, ఆ నిధులు రాగానే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, మహేశ్రెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్కుమార్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా పరిషత్ సీఈవో జానకిరెడ్డి, పీఆర్ఈఈ శ్రీనివాస్రెడ్డి, డీఈలు, ఏఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అనంతరం కెరెళ్లికి వెళ్లి నేడు వివాహం చేసుకోబోతున్న టీఆర్ఎస్ కార్యకర్త సుదర్శన్రెడ్డి, శ్రీలతలను ఆశీర్వదించారు. గ్రామంలో ఓ ఇంటి ముందు తాగునీరు వృథాగా పోతున్న నల్లాను కారుదిగి స్వయంగా బంద్ చేశారు. తాగునీటిని వృథా చేయవద్దని గ్రామస్తులకు సూచించారు.