షాబాద్ : వృద్ధులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిత్యం యోగా సాధన చేయాలని రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పలువురు సీనియర్ సిటీజన్లను, వృద్ధాశ్రమల యజమానులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారి మాట్లాడుతూ వృద్ధాశ్రమంలో తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. అదే విధంగా కన్న బిడ్డలు సైతం తల్లిదండ్రుల సంక్షేమాన్ని తమ బాధ్యతగా భావించాలని, అప్పుడే వయోవృద్ధులకు సముచితంగా గుర్తించి గౌరవించినట్లవుతుందని సూచించారు. అనంతరం ఇబ్రహీంపట్నం, కందుకూరు ఆర్డివో వెంకటచారి మాట్లాడుతూ వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు.
సీనియర్ సిటిజన్ చట్టాలపై వృద్ధులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జిల్లా ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి హనుమంతు మాట్లాడుతూ ఎల్డర్లైన్ నేషనల్ హెల్ఫర్ సీనియర్ సిటిజన్స్ పేరుతో వృద్ధులు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం 14567 వయో వృద్ధుల హెల్ఫ్లైన్ నంబర్ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. పెద్దల సంరక్షణ, మానసిక భావోద్వేగాలకు సలహాలు, సూచనలతో పాటు చట్టపరమైన మార్గదర్శకత్వం ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవోలు శాంతిశ్రీ, వినితదేవి, లక్ష్మిబాయి, సరిత, సక్కుబాయి, జిల్లా సీనియర్ సిటిజన్స్ కమిటీ మధుసూదన్, విజయలక్ష్మి, నర్సయ్య, రంగయ్య, వయోవృద్ధులు ఉన్నారు.