తలకొండపల్లి : రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అందుబాటులో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో రైతులకు అందుబాటులో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. తలకొండపల్లి మండలంలో వరి, మొక్కజొన్న, కందులు, పత్తిశనగల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. రైతులకు కావలసిన సంచులు, లారీలను సమకూర్చి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కొనసాగుతుందన్నారు.
ప్రభుత్వం సూచించిన ధర ప్రకారం రైతుల వద్ద ధాన్యం సేకరణ ఉంటుందన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కల్యాణలక్ష్మీ, రైతుబందు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, మిషన్కాకతీయ, మిషన్భగీరథ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేషపెట్టిందన్నారు. రైతుల సంక్షేమం కోసం 24గంటల కరెంట్, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు వంటి కార్యక్రమాలను చేపడుతుందన్నారు. కార్యక్రమంలో ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సింగిల్విండో చైర్మన్ కేశవరెడ్డి, సర్పంచ్లు రమేశ్యాదవ్, రమేశ్, ఎంపీటీసీ రమేశ్, సింగిల్విండో వైస్ చైర్మన్ రవికుమార్, డైరెక్టర్లు పాల్గొన్నారు.