శంకర్పల్లి : శంకర్పల్లి మున్సిపాలిటీకి టీయూఎఫ్ఐ డీసీ నిధులు రూ. 10కోట్లు మంజూరయ్యాయని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, కట్టుబడి ఉన్నారని చెప్పారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. తాను కూడా మున్సిపాలిటీ అభివృద్ధి తన సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సమన్వయంతో చైర్పర్సన్కు అభివృద్ధి విషయంలో సహకరించాలని సూచించారు. పట్టణంలో మున్సిపాలిటీకి చెందిన మడిగెలకు కిరాయి పెంచాలని పలువురు సభ్యులు సమావేశంలో తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్ పనులు, శ్మశాన వాటిక పనులు ఇంకా మొదలు కాలేదని వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి సభలో చెప్పారు. మిషన్ భగీరథ నీరు కొన్ని వార్డుల్లో వృథాగా పోతున్నాయని 11వ వార్డు కౌన్సిలర్ శ్రీనాథ్గౌడ్ తెలిపారు. కొన్ని వార్డుల్లో మిషన్ భగీరథ నీరు రావడం లేదని సభ దృష్టికి తెచ్చారు. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు సభ్యులు ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి, కౌన్సిలర్లు సంతోష్, సంధ్యారాణి, రాధ, గోపాల్, లక్ష్మమ్మ, ఆశోక్, రాములు, చంద్రమౌళి, లావణ్య, శ్రీనాథ్గౌడ్, వాణి, నూర్జహాబేగం, శ్వేత పాల్గొన్నారు.