యాచారం : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పథకం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి పనులు బాగున్నాయని జాతీయ గ్రామీణభివృద్ధి శాఖ ప్రతినిధులు కితాబిచ్చారు. మండలంలో కొనసాగుతున్న గ్రామీణాభివృద్ధి పనులను అధ్యాయనం చేసేందుకు కేంద్రబృందం ప్రతినిధులు మంగళవారం మండలంలో పర్యటించారు. జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన ప్రొఫెసర్లు సౌందర్య ఫాండ్యన్, నెహ్రూలు మండంలోని గడ్డమల్లాయగూడ, దర్పల్లి గ్రామాలను సందర్శించారు. అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో బేటి అయ్యారు. గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పథకం పనులు, ఆసరా పింఛన్లు, వాటర్షేడ్ పనులు, జాతీయ జీవనోపాధి, మహిళా సంఘాల పనితీరు, గ్రామీణ సడక్ యోజన, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ విధి నిర్వాహణపై వారు పూర్తి స్థాయిలో అధ్యాయనం చేశారు.
గ్రామ పంచాయతీల రికార్డులను, ఉపాధి హామీ పథకం రికార్డులను వారు స్వయంగా పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి అందులో చిట్టడవుల్లా పెంచుతున్న మొక్కలను చూసి అభినందించారు. అనంతరం మండలంలోని దర్పల్లి గ్రామంలో పర్యటించి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. రైతులు పండిస్తున్న ఆధునిక వ్యవసాయానికి, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పలు అభివృద్ధి పనులను చూసి వారు వ్యక్తం చేశారు. ముఖ్యంగా పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్టు యార్డు, రైతువేదిక, హరితహారం మొక్కలను పరిశీలించి అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు బాగున్నాయని కితాబిచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం ప్రతినిధులు సౌందర్యన్ పాండ్య, నెహ్రూలు మాట్లాడుతూ మొక్కలను పెంచడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. దేశంలోనే ఆదర్శంగా ఆసరా పింఛన్లు ఇవ్వడం అభినందనీయమన్నారు. రైతు సౌకర్యార్థం గ్రామల్లో క్లస్టర్ రైతువేదికలు నిర్మించడం గొప్ప విషయమన్నారు.
రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై కేంద్ర గ్రామీణ శాఖకు నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి నీరజ, అదనపు ప్రాజెక్టు అధికారి జంగారెడ్డి, ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు జంగయ్య, నర్సిరెడ్డి, ఎంపీడీఓ మమతాబాయి, ఎంపీఓ శ్రీలత, పంచాయతీరాజ్ ఏఈ రాంసింగ్, ఏపీఓ లింగయ్య, ఏపీఎం సతీశ్, ఈసీ శివశంకర్రెడ్డి, సర్వేయర్ సతీష్రెడ్డి, ఆర్ఐ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శులు దీపిక, రాజేష్, వార్డు సభ్యులు, టీఏలు, సీసీలు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.