షాబాద్ : పిల్లల ఎదుగుదలకు పోషకాహారం అందించాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పోషణమాసం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న పోషణమాసంలో రక్తహీనత, పౌష్టికాహారం లోపం, తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశాలపై మహిళల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ పోషణ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి పరిష్కరించాలన్నారు.
జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్బిణులు, బాలింత లు, పసి పిల్లలకు పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందించాలని సూచించారు. మండలాల వారీగా పిల్లలలో ప్రస్తుతం ఉన్న బరువు, ఉండాల్సిన బరువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడూ తెలుసుకోవాలని, పిల్లల్లో అనిమియా రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ప్రతి పాఠశాల పరిశుభ్రంగా ఉండేలా శానిటేషన్ చేయించాలని జిల్లా విద్యాధికారికి సూచించారు.
పిల్లల ఎత్తు, బరువు ఎప్పటికప్పుడూ కోలిచి ఆప్డెట్ చేయాలన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు నీటి సౌకర్యం కల్పించాలని, పెండింగులో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. అనంతరం పోషణమాసం గోడ పత్రికను విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి మోతి, జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి, విద్యాశాఖ అధికారి సుశీందర్రావు, డీపీవో శ్రీనివాస్ రెడ్డి, సీపీఓ ఓంప్రకాశ్, మిషన్ భగీరథ అధికారులు, సీఈపీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.