జిల్లాలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నది. పదిహేను రోజుల్లో అర్హులందరికీ కార్డులు అందజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నది. దరఖాస్తుదారుడి కుటుంబం దారి్రద్య్రరేఖకు దిగువన ఉన్నదా.. ప్రభుత్వ ఉద్యోగులున్నారా వంటి వివరాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నారు. రేషన్కార్డుల కోసం జిల్లావ్యాప్తంగా మొత్తం 57,910 దరఖాస్తులు రాగా.. ఇప్పటివరకు 1858 ఆప్లికేషన్లను పరిశీలించారు. ఇందులో 1275 ఆమోదం పొందగా.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 583 దరఖాస్తులను తిరస్కరించారు. మరో పది రోజుల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అర్హుల సంఖ్య తేల్చే దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 5,24,485 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి.
రంగారెడ్డి, జూన్ 24, (నమస్తే తెలంగాణ): జిల్లాలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతమైంది. పదిహేను రోజుల్లోగా రేషన్ కార్డుల జారీకి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో ఆ దిశగా జిల్లా పౌర సరఫరాల శాఖ ప్రక్రియను వేగవంతం చేసింది. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులకు సంబంధించి ఒక్కొక్కటిగా ఇంటింటికెళ్లి విచారణ చేస్తున్నారు. సదరు దరఖాస్తుదారులు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబమేనా, సంబంధిత దరఖాస్తుదారుడి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులున్నారా వంటి వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులకు ఆమోదం తెలుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తిరస్కరిస్తున్నారు. జిల్లాలోని పట్టణాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్వోలతో దరఖాస్తుల పరిశీలన కొనసాగుతున్నది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ చేపట్టారు.
కొత్త రేషన్ కార్డులకు 57,910 దరఖాస్తులు
జిల్లావ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు 57,910 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటివరకు 1858 దరఖాస్తుల విచారణ పూర్తికాగా, 1275కు ఆమోదం తెలిపారు. మరో 583 దరఖాస్తులు ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి లేకపోవడంతో తిరస్కరించారు. మరో 56,052 దరఖాస్తుల పరిశీలన చేయాల్సి ఉంది. కొత్త కార్డుల దరఖాస్తుల్లో అత్యధికంగా అర్బన్ పరిధిలోని సరూర్నగర్, బాలాపూర్, గండిపేట్, అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో ఉన్నాయి. జిల్లాలో అందిన దరఖాస్తుల్లో సగానికిపైగా సరూర్నగర్ మండలంలోనే ఉండడం గమనార్హం. సరూర్నగర్ మండలంలో 33,926 దరఖాస్తులు, బాలాపూర్ మండలంలో 3,939, గండిపేట్ మండలంలో 2,792, అబ్దుల్లాపూర్మెట్ మండలంలో 2514 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ప్రస్తుతం 5,24,485 రేషన్ కార్డులుండగా, ప్రస్తుతం జిల్లాలో నెలకు 26,937 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అయితే మరో పది రోజుల్లో జిల్లాలో కొత్తగా ఎన్ని రేషన్ కార్డులు పెరుగనున్నాయనేది లెక్క తేలనున్నది. కొత్తగా 50 వేల వరకు కార్డులకు ఆమోదం తెలిపితే సుమారు 300 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా అవసరమని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు.
1275 దరఖాస్తులకు ఆమోదం
జిల్లాలో ఇప్పటివరకు 1858 దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో 1275 దరఖాస్తులకు జిల్లా పౌరసరఫరాల శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో మండలాల వారీగా పరిశీలిస్తే అబ్దుల్లాపూర్మెట్-30, ఆమనగల్లు-5, బాలాపూర్-83, చేవెళ్ల-4, చౌదరిగూడెం-5, ఫరూఖ్నగర్-3, గండీపేట-72, ఇబ్రహీంపట్నం-5, కందుకూరు-6, కొత్తూరు-1, మాడ్గుల-25, మహేశ్వరం-9, మంచాల-2, మొయినాబాద్-7, సరూర్నగర్-1001, షాబాద్-2, శంషాబాద్-8, యాచారం-7 దరఖాస్తులకు ఆమోదం తెలిపారు.