షాబాద్, జూన్ 24 : ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్.కె.పురం డివిజన్లో పార్క్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కరోనాపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తీసుకున్న చర్యలతో సెకండ్ వేవ్ను నియంత్రించినట్లు చెప్పారు. అన్ని రాష్ర్టాల కన్నా ముందు అప్రమత్తమై బ్లాక్ ఫంగస్ కేసులను తగ్గించడానికి ప్రత్యేకంగా ఈ.ఎన్.టి దవాఖానను సిద్ధం చేసి చికిత్స అందించినట్లు తెలిపారు. జ్వర సర్వే, సూపర్ స్పైడర్స్, హైరిస్క్ ఉన్న వాళ్లకు వ్యాక్సిన్తో సత్ఫలితాలు వచ్చాయన్నారు. మూడో వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కునేందుకు దవాఖానలు సిద్ధం చేశామన్నారు. వైద్య రంగంపై ఎన్ని నిధులైనా వెచ్చించి ప్రజల ప్రాణాలు కాపాడటానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పెద్దఎత్తున బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలో రూ.90లక్షలతో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ నాలాపై స్లాబ్ నిర్మాణం, 20వ వార్డులో రూ.64లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ నీటి ట్యాంకు ప్రారంభం, ఆర్.కె.పురం డివిజన్లో సౌభాగ్యపురం కాలనీలో రూ.85లక్షలతో సీసీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం మహిళలకు మిషన్ భగీరథ తాగునీరు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. శ్రీరామ్ కాలనీలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఉండడంతో మినీ ఇండియాగా మారిందన్నారు. ప్రజలకు ఉచితంగా తాగునీరు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లాఅహ్మద్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, శంకర్, బాషమ్మ, శంషొద్దీన్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇక్బాల్, ఉపాధ్యక్షుడు యూసుఫ్ పటేల్ పాల్గొన్నారు.