షాబాద్, జూలై 6 : ప్రజల సంపూర్ణ సహకారంతోనే పట్టణ ప్రగతికి సార్థకతని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డిజిల్లాలోని తుక్కుగూడ మున్సిపాలిటీలోని సర్దార్నగర్ 11వ వార్డులో పట్టణ ప్రగతిలో మంత్రి పాల్గొన్నారు. రూ.23లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పనులకు శంకుస్థానపలు చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను వేరుచేసి డంపింగ్ యార్డులకు తరలిస్తే.. ఎరువుల తయారీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పట్టణాలు ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
స్వచ్ఛత, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో సీజనల్ వ్యాధులు పూర్తిగా తగ్గిపోయినట్లు చెప్పారు. స్వచ్ఛ సర్దార్నగర్ కోసం ప్రజలందరూ సహకరించాలన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో రూ.కోటితో వైకుంఠధామం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నల్లానీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పదిరోజుల పట్టణ ప్రగతి స్ఫూర్తి ఎల్లవేళలా కొనసాగించాలని చెప్పారు. ప్రతి ఇంటికి అందిస్తున్న ఆరు మొక్కలను తప్పనిసరిగా ఇంటి ఆవరణలో నాటి, సంరక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.