రంగారెడ్డి, జూన్ 7,(నమస్తే తెలంగాణ) : వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 11 వరకు గ్రామపంచాయతీల్లో ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా పంచాయతీ అధికారులు గ్రామపంచాయతీల్లో ఐదు రోజుల్లో చేసే పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికను రూపొందించారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులతోపాటు సర్పంచ్, ఉప సర్పంచులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వర్షపు నీరు నిల్వ ఉండడంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం, మురుగునీరు నిల్వ ఉండడం, పారిశుధ్యం లోపించడం తదితర కారణాలతో మలేరియా, టైఫాయిడ్, డయేరియా, స్వైన్ఫ్లూ, కలరా తదితర వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. ఆహారంలో పరిశుభ్రత లోపిస్తే అతిసార, కామెర్లు, టైఫాయిడ్ వ్యాధులు, తాగునీరు, పరిశుభ్రత లోపిస్తే టైఫాయిడ్, కలరా వ్యాధులు, దోమ కాటుతో మలేరియా, డెంగీ, ఈగలతో టైఫాయిడ్తోపాటు స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి.
ఈ నెల 11 వరకు ప్రత్యేక డ్రైవ్..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల నుంచి 11 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కొనసాగనుండడంతో చాటింపు వేయనున్నారు. పంచాయతీ కార్యదర్శులతోపాటు సర్పంచులు గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి లోతట్టు ప్రాంతాలు, పల్లపు ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో గుర్తించి, 5 రోజుల్లో పూడ్చివేసేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. పారిశుధ్య పనులకు కావాల్సిన ఫాగింగ్ యంత్రాలు, స్ప్రేయర్లు, బ్లీచింగ్ పౌడర్, హైపోక్లోరైట్ సొల్యూషన్, గాంబోషియా ఫిష్, ఆయిల్ బాల్స్, యాంటి లార్వా లిక్విడ్ వంటివి ముందుస్తుగా సమకూర్చుకునున్నారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల్లోపు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఉండేలా చర్యలు చేపట్టారు. పనులు పూర్తైన తర్వాత ఫొటోలు తీయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సాయంత్రంలోగా నివేదికతోపాటు ఫొటోలను జిల్లా పంచాయతీ అధికారికి పంపనున్నారు. ప్రత్యేక డ్రైవ్లో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు.
ఐదు రోజుల్లో చేపట్టే పనులివే…
ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించనున్నారు. గ్రామపంచాయతీలోని అంతర్గత రోడ్లను, వీధులన్నింటిని ప్రతి రోజు శుభ్రపర్చి, కలుపు మొక్కలు, గడ్డి, చెత్తాచెదారం, ముళ్ల కంపలను తొలగిస్తారు. మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లనున్నారు. నీటి నిల్వ ఉన్న ప్రాంతాలు, పైప్లైన్ లీకేజీ మరమ్మతులు చేయడం, గ్రామాల్లో ఫాగింగ్ యంత్రం ద్వారా స్ప్రే చేసి రోగకారక జీవులు చేరకుండా చూడడం వంటి పనులు చేపడుతారు. ఈ నెల 10న గ్రామాల్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు, జీఎల్ఎస్ఆర్ ట్యాంకులు మొత్తం ఇతర తాగునీటి వనరులను తనిఖీ చేసి శుభ్రం చేస్తారు. ఈ నెల 11న మురుగు కాల్వల నుంచి తీసిన పూడికను చెత్తను తొలగించనున్నారు.