రంగారెడ్డి, జూన్ 22, (నమస్తే తెలంగాణ) : 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు మంజూరు చేసే రుణాల లక్ష్యాన్ని పెంచుతూ జిల్లా లీడ్ బ్యాంకు అధికారులు ప్రణాళికను రూపొందించారు. ముఖ్యంగా రైతులకు అందజేసే పంట రుణాలను కూడా పెంచారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.200 కోట్లను పెంచుతూ వార్షిక రుణ ప్రణాళికను తయారు చేశారు. అయితే వార్షిక రుణ ప్రణాళికలో పంట రుణాలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు, పౌల్ట్రీ, మత్స్య, డెయిరీ, ఉద్యానవన రైతులకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం ప్రాధాన్యతా రంగాలకు రూ.10,600 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ప్రాధాన్యేతర రంగాలకు రూ.7003 కోట్ల రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. ప్రతీ ఏటా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించినప్పటికీ రుణాల మంజూరులో మాత్రం బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఈ ఆర్థిక సంవత్సరం అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణాలను మంజూరు చేసేందుకుగాను రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.
రుణ లక్ష్యం…రూ.17,604 కోట్లు…
ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ లక్ష్యాన్ని రూ.17,604 కోట్లుగా నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు కలిపి మొత్తం 3,90,350 మందికి రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకుగాను రూ.3898 కోట్ల రుణాలను మంజూరు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాధాన్యతా రంగాలకు అత్యధికంగా రూ.10,600 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.7003 కోట్ల రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. పౌల్ట్రీ, డెయిరీ, మత్స్యకారులు, ఉద్యానవన, అటవీ భూ అభివృద్ధికి సంబంధించి 22,197 మంది రైతులకుగాను రూ.1240 కోట్ల రుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు 81,391 మందికిగాను రూ.5790 కోట్ల రుణాలిచ్చేందుకు టార్గెట్గా నిర్ణయించారు.
పంట రుణాలు రూ.2073 కోట్లు..
ఈ ఆర్థిక సంవత్సరానికిగాను వానకాలం, యాసంగి సీజన్లలో రూ.2073 కోట్ల పంట రుణాలను మంజూరు చేయాలని ప్రణాళికను రూపొందించారు. పంట రుణాలకు సంబంధించి గతేడాదితో పోలిస్తే రూ.200 కోట్ల మేర రుణాలను పెంచుతూ నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా 2,18,412 మంది రైతులకుగాను రుణాలను మంజూరు చేయనున్నారు. గతేడాది రూ.1810 కోట్ల రుణాలను 95 వేల మంది రైతులకు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా కేవలం రూ.785 కోట్ల రుణాలను మాత్రమే బ్యాంకర్లు మంజూరు చేశారు. వానకాలం సీజన్కుగాను రూ.1208 కోట్ల రుణాలను జిల్లా రైతాంగానికి మంజూరు చేయాలని నిర్ణయించగా, రూ.494 కోట్లు రుణాలను, అదేవిధంగా యాసంగి సీజన్లో రూ.602 కోట్ల రుణాలను రైతులకు అందించాలని లక్ష్యంగా నిర్ణయించగా, కేవలం రూ.291 కోట్ల రుణాలను మాత్రమే మంజూరు చేశారు. అర్హులైన ప్రతీ రైతుకు పంట రుణాలందేలా జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది.
ప్రణాళికను విడుదల చేసిన అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్
సన్న, చిన్నకారు రైతులు, ఔత్సహిక పారిశ్రామిక వేత్తలు, కుటీర పరిశ్రమలు, చేతి వృత్తుల వారిని బ్యాంకర్లు ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని కోర్టు హాల్లో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్న, చిన్నకారు రైతులు పంట రుణాలను పొంది ఆర్థికంగా బలోపేతమయ్యేలా అవగాహన కల్పించాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎంతో మంది పేదవారు ఉన్నారని, వారికి సకాలంలో రుణాలను మంజూరు చేయాలన్నారు. రైతులకు ప్రభుత్వం అందించే రైతుబంధు నిధులను ఇతర రుణాలకు జమ చేసుకోకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రిజ్వాన్, నాబార్డు ఏజీఎం ప్రవీణ్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, డీఆర్డీవో ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.