ఇబ్రహీంపట్నం : అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బండరావిరాల, తదితర గ్రామాలల్లో ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వం మైనింగ్జోన్ కోసం సేకరించిన భూములకు నష్టపరిహారం చెల్లించలేదని బాధితులకు త్వరలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం ఇవ్వడానికి సానుకూలంగా స్పందించిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం బండరావిరాల బాధిత రైతులకు సంబంధించిన అంశంపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించటంతో మంగళవారం అబ్దుల్లాపూర్మెట్ మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బండరావిరాల, చిన్నరావిరాల, ఓలేటి గ్రామాలల్లో 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మైనింగ్జోన్ కోసం 670 ఎకరాల భూమిని తీసుకుందని అన్నారు. అందులో ఉన్న సుమారు 209 మంది రైతులకు పరిహారం చెల్లించలేదు. పరిహారం కోసం బాధిత రైతులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు విన్నవించినా వారికి పరిహారం ఇవ్వలేదు. దీంతో పరిహారం ఇవ్వకుండానే ప్రభుత్వం భూమి స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమిని అప్పట్లోనే క్రషర్ మిషన్ ఏర్పాటు చేసుకునే వ్యాపారులకు కట్టబెట్టింది. బాధిత రైతులు ఈ విషయంపై అప్పటినుంచి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ విషయమై తానుకూడా పరిహారం ఇప్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు.
కాగా, ఇటీవల కొంతమంది కాంగ్రెస్ నాయకులు తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం బాధితులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఇటీవల ఈ మూడు గ్రామాలకు రైతులు తమ వద్దకు రావడంతో పరిహారం ఇప్పించే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లి త్వరలోన్యాయం చేస్తామని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, త్వరలోనే బాధిత రైతులకు పరిహారం కూడా ఇప్పిస్తానని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, అబ్దుల్లాపూర్మెట్ మండలం అధ్యక్షుడు కిషన్గౌడ్తో పాటు పలువురు నాయ కులు పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీలో ప్రస్తావించి తమకు పరిహారం ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ మూడు గ్రామాలకు చెందిన బాధిత రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.