కరోనా రక్కసిని కట్టడి చేసేందుకు వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. వైరస్ నియంత్రణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి బాధితులకు జీవం పోస్తున్నారు. కరోనా వచ్చిందంటే అయినవారు కానివారుగా మొఖం చాటేస్తున్న రోజులివి. ఇటువంటి ఆపత్కాలంలో వైద్య సేవలందించి ఆపద్బాంధవులుగా అండగా నిలుస్తున్నారు. కోట్లకొద్దీ ధనమున్నా ఆరోగ్యాన్ని మించిన భాగ్యం లేదంటారు పెద్దలు. అటువంటిది కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుతూ కనిపించే దేవుళ్లలా మారుతున్నారు. వైద్యో..నారాయణో..హరిః అన్న నానుడిని నిజం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 61 ప్రభుత్వ దవాఖానలుండగా, 700 మందికిపైగా వైద్యులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారు.
జిల్లాలోని కొండాపూర్, వనస్థలిపురం, చేవెళ్ల, మహేశ్వరం, షాద్నగర్, రాజేంద్రనగర్ ప్రభుత్వ దవాఖానలతోపాటు పలు కొవిడ్ కేర్ సెంటర్లలోనూ కరోనా వైద్య సేవలు అందుతున్నాయి. జిల్లాలోని 61 కరోనా పరీక్ష కేంద్రాల్లో నిత్యం 3 వేల మందికి టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందజేయడంతో పాటు వారితో కలిసి ఉన్నవారి వివరాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఇంటింటి జ్వర సర్వే చేసి, మెడికల్ కిట్లను అందజేస్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుపుతూ ఆరోగ్య ప్రదాతలవుతున్నారు. రోజుకు 4 వేల మందికిపైగా వ్యాక్సిన్ వేస్తూ కరోనా నియంత్రణలో కీలకపాత్రను పోషిస్తున్నారు. నిరంతరం శ్రమిస్తూ బాధితులకు జీవం పోస్తున్న వైద్యలోకం ప్రజల గుండెల్లో నిలుస్తున్నది.
రంగారెడ్డి, మే 27, (నమస్తే తెలంగాణ): వైద్యో.. నారాయణో.. హరి.. వైద్యుడు సాక్షాత్తు దేవుడితో సమానం అని పెద్దలు చెబుతారు. రెండేండ్ల్లుగా కరోనా విజృంభిస్తున్నది. ఈ కష్టకాలంలో వైద్యులు కరోనా బారిన పడిన ఎంతోమంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్య లోకం అహర్నిశలు కృషి చేస్తున్నది. మొదటి దశ నుంచి ఇప్పటి వరకు వేలాది మంది కొవిడ్ బాధితులకు చికిత్స అందిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నారు. తమకూ ముప్పు పొంచి ఉన్నప్పటికీ బాధితులకు వైద్య చికిత్సలు చేస్తున్నారు. దీంతో వారు కరోనా వారియర్స్గా గుర్తింపు పొందారు. ఫ్రంట్లైన్ వారియర్స్లో ముందు వరుసలో ఉండి బాధితులకు చికిత్సలు అందిస్తున్నారు. వైద్యులు, దవాఖాన సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా నియంత్రణకు తమవంతు పోరాటం చేస్తున్నారు. కరోనా బారిన పడిన వారికి, సొంత వాళ్లే దూరమై కర్కషంగా వ్యవహరిస్తున్న వేళ మానవత్వంతో వైద్యులు, సిబ్బంది ముందుకొచ్చి సేవలందిస్తున్నారు.
నిర్విరామంగా వైద్య సేవలు..
రెండేండ్లుగా నిర్విరామంగా వైద్య సేవలు అందించేందుకు, తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ దవాఖానలకు పరిమితమవుతున్నారు. ఎన్నో త్యాగాలు చేస్తూ విశేష సేవలందిస్తున్నారు. చాలామంది వైద్యులు, సిబ్బంది వారి నుంచి కుటుంబ సభ్యులకు కొవిడ్ వ్యాపిస్తుందేమోనన్న భయంతో నెలల తరబడి ఇండ్లకు వెళ్లడంలేదు. గతేడాది కరోనా విస్తరిస్తున్న సమయంలో కొందరు వైద్యులు, సిబ్బందితో చుట్టుపక్కల ఇండ్లవారు మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. కరోనా బాధితుల మధ్య తిరుగుతున్నందున బంధువులు కూడా కలువడానికి ముఖం చాటేశారు. అయినా వైద్యులు మాత్రం ఇప్పటికీ కరోనా కట్టడికి, ప్రజల ప్రాణాలను రక్షించడమే ధ్యేయంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చిందంటే చాలా కుటుంబ సభ్యులే దూరంగా ఉంటున్న పరిస్థితుల్లోనూ బాధితులకు పరీక్షలు చేస్తూ, చికిత్స అందిస్తూ సాహసోపేతంగా విధులు నిర్వహిస్తున్నారు.
కొవిడ్ బాధితులకు ధైర్యాన్నిస్తూ..
రంగారెడ్డి జిల్లాలో రెండో దశలోనూ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో కొవిడ్ పరీక్షలు, చికిత్స, వ్యాక్సినేషన్ ప్రక్రియను వెనుకంజ వేయకుండా నిరంతరాయంగా వైద్య సేవలందిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొండాపూర్ జిల్లా దవాఖానతోపాటు వనస్థలిపురంలోని ఏరియా దవాఖానలో ఐసొలేషన్ కేంద్రాలున్నాయి. చేవెళ్ల ప్రభుత్వ దవాఖానలో 25 పడకలు, మహేశ్వరంలో 25 పడకలు, షాద్నగర్లో 50 పడకలు, రాజేంద్రనగర్లో 25 పడకలతో కొవిడ్ కేర్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులోనూ వైద్యులు, సిబ్బంది చికిత్స అందిస్తున్నారు.
ప్రతిరోజూ యోగ క్షేమాలు తెలుసుకుంటూ..
కొవిడ్ కేర్ కేంద్రాలు, ఐసొలేషన్ కేంద్రాల్లో కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారి క్షేమ సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకుంటూ వారికి ధైర్యాన్నిస్తున్నారు. దవాఖానల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తుండడంతోపాటు హోం ఐసొలేషన్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మందుల కిట్లు కూడా అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు సుమారు 3 వేల మందికి 61 కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారితోపాటు వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ వివరాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు 4 వేల మందికిపైగా వ్యాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించడంలోనూ వైద్యలోకం నిరాంతరాయంగా కృషి చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా 700లకుపైగా వైద్యులు, సిబ్బంది కరోనా మహమ్మారి కట్టడికి నిర్విరామంగా వైద్య సేవలందిస్తున్నారు.